PV Narasimha Rao: దేశాన్నే మలుపు తిప్పిన తెలుగు ఠీవి.. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రకటించడంపై కేసీఆర్ ఏమన్నారంటే..

తెలుగు ఠీవి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత దేశాన్ని మలుపు తిప్పిన నాయకుడిగా PV నరసింహారావుకు ఈ దేశ ప్రస్థానంలో కీలకమైన స్థానం ఉంది. 1991లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

PV Narasimha Rao: దేశాన్నే మలుపు తిప్పిన తెలుగు ఠీవి.. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రకటించడంపై కేసీఆర్ ఏమన్నారంటే..
KCR - PV Narasimha Rao

Updated on: Feb 09, 2024 | 2:06 PM

తెలుగు ఠీవి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత దేశాన్ని మలుపు తిప్పిన నాయకుడిగా PV నరసింహారావుకు ఈ దేశ ప్రస్థానంలో కీలకమైన స్థానం ఉంది. 1991లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థికరంగ నిపుణుడు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు PV నరసింహారావు. పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన పీవీ నరసింహారావు దేశానికి పలు హోదాల్లో సేవలు అందించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఎంపీగా, అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నో ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. దేశం ఆర్థికంగా పురోగమించడానికి ఆయన దార్శనిక నాయకత్వం ఉపయోగపడిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి PV నరసింహారావు పటిష్ఠమైన పునాదులు వేశారంటూ మోదీ కీర్తించారు. సరళీకరణ విధానాలతో ప్రపంచ మార్కెట్లకు PV తలుపులు తెరిచారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. అలాగే భారత విదేశాంగ విధానానికి, భాషకు, విద్యారంగానికి ఆయన సేవలు అపారమైనవని ప్రధాని మోదీ వివరించారు.

రాజకీయాల్లో PV అపర చాణక్యుడిగా పేరు పొందారు. దినదిన గండం, నూరేళ్ల ఆయుష్షుగా సాగిన ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపారు. ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన తొలి గాంధీ కుబుంబేతరుడిగా PV రికార్డు నెలకొల్పారు.

తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం..

పీవీ నరసింహారావుకు భారతరత్న దక్కడం హర్షణీయమన్నారు బీఆర్ఎస్‌ అధినేత KCR. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమన్నారు. బీఆర్ఎస్ డిమాండ్‌ను గౌరవించి.. పీవీకి భారతరత్న ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్.

ఎప్పుడో రావాల్సి ఉంది..

మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత పురస్కారం దక్కడం హర్షణీయమని పీవీ కుమార్తె సురభి వాణిదేవి పేర్కొన్నారు. పీవీ అన్నివిధాలా భారత అత్యున్నత పౌర పురస్కారానికి అర్హుడన్నారు పీవీ మనవడు సుభాష్‌. ఎప్పుడో ఈ పురస్కారం ఆయనకు రావాల్సి ఉన్నా కొంత ఆలస్యమయినప్పటికీ భారత రత్న ప్రకటించడంతో భావోద్వేగానికి గురి అయ్యామని పీవీ మనవడు ఎన్.వీ సుభాష్‌ తెలిపారు. పీవీ కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తి అయిప్పటికీ బీజేపీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం సంతోషకరమని పీవీ మనవడు ఎన్.వీ సుభాష్‌ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..