
హైదరాబాద్, మే 16: రాగల మూడు నాలుగు రోజులలో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఈ రోజు (మే 16) తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ వైపు వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 41.8, కనిష్టంగా హైదరాబాద్, మెదక్ లలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది. నిన్న (మే 15) మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.