HYDRA: హైడ్రా టార్గెట్ ఏంటి? పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంటోంది..?

| Edited By: Janardhan Veluru

Aug 30, 2024 | 12:57 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా మీదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. హైడ్రా అంటే ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది.

HYDRA: హైడ్రా టార్గెట్ ఏంటి? పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంటోంది..?
Hydra
Follow us on

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోధ్యన్యత్క్షత్రియస్య న విద్యతే ||

“ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక యోధుడికి పోరాడడం కంటే మెరుగైన ప్రత్యామ్నాయం లేదు” అని భగవద్గీత శ్లోకంలోని భావం. “శ్రీకృష్ణుడి బోధనలను అనుసరించే ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం. ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నాం. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తున్నాం” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు హితోపదేశం చేశారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతాం అంటూ గర్జించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది అనేది ఎన్నో అనుభవాలు చాటుతూనే ఉన్నాయి. ఇటీవల చెన్నై, వయనాడ్‌లో అలాంటి పరిస్థితులను చూశాం. ఏడాది క్రితం హిమాచల్‌ ప్రదేశ్‌లో నాలుగేళ్ల క్రితం చార్‌దామ్‌లో ప్రకృతి విరుచుకుపడితే ఎంతటి విధ్వంసం ఉంటుందో ఊహకందని ఆ విలయం కళ్లముందు కదలాడుతూనే ఉంది. భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది.

“నీవు ప్రకృతితో ఆడుకుంటే.. ప్రకృతి నిన్ను నాశనం చేస్తుంది” అని అంటాడు పర్యావరణ శాస్త్రవేత్త. అందుకే భవిష్యత్‌ తరాల అవసరాలకు అనుగుణంగా పూర్వీకులు ప్రసాదించిన చెరువులు, కుంటల పరిరక్షణకు తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పూనుకోవడం అభినందించదగ్గ పరిణామం. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయడం, దానికి ఐపీఎస్‌ ఆఫీసర్‌ రంగనాథ్‌ను ఛైర్మన్‌గా నియమించడమే ఓ విప్లవాత్మకం. “అక్రమ నిర్మాణాలను అసలు వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా అసలు వెనక్కి తగ్గదే లేదు. సన్నిహితులైనా, బంధువులైనా డోంట్‌ కేర్‌. పార్టీలకతీతంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతాయి” అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు చాలు ఆయన ఎంత క్లియర్‌గా ఉన్నారో. అంతేకాదు.. ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత పల్లంరాజు నిర్మాణాల్నే మొదట కూల్చివేయడం హైడ్రా చిత్తశుద్దికి అద్దం పడుతుంది.

స్వపక్షమైనా..విపక్షమైనా..ప్రజాసంపదను సంరక్షించడం కోసం ఎందాకైనా వెళ్తాను అన్నది రేవంత్ రెడ్డి మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. విమర్శలొచ్చినా.. ప్రశంసలొచ్చినా హైడ్రా దూకుడు మాత్రం తగ్గేదేలే అన్న మెస్సేజ్ చాలా బలంగా తీసుకెళ్తున్నారు. వారం పదిరోజులుగా హైడ్రా బుల్డోజర్ కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతోంది. చెరువును చెరబట్టారని తెలిస్తే చాలు కూల్చివేసుడే. ఈరేంజ్‌లో హైడ్రా దూకుడు చూపిస్తుందంటే…ముందుంది అసలు సిసలు పండుగ అన్నట్టుగా ఉంది.

హైడ్రా అంటే ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా మీదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. హైడ్రా అంటే ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడిన హైదరాబాద్‌ మహా నగరం నేడు కాంక్రీట్ జంగిల్‌గా మారింది. చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి, నాలాలాను మూసేసి నిర్మాణాలు చేపట్టడమే కారణమన్నది అందరికీ తెలిసిందే. దీన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్..  హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఔటర్‌ రింగ్ రోడ్డు వరకు హైడ్రాను విస్తరించారు.

హైడ్రాకు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తుండగా.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ కమిషర్‌గా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు నిర్మోహటంగా కూల్చేసే పనిలో పడింది హైడ్రా. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను సైతం కూల్చేశారు. ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతాయని వెనకడగు వేసేది లేదని చెబుతున్నారు.

Hydra

ఢిల్లీ టవర్స్ కూల్చివేతే స్ఫూర్తి :

70కోట్ల బడ్జెట్‌తో కట్టిన ఈట్విన్ టవర్స్‌ను కట్టడానికి ముూడేళ్ల సమయం పట్టింది. కానీ కూల్చేందుకు కేవలం 9సెకన్లు మాత్రమే పట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ట్విన్ టవర్స్‌ను కట్టారని ఇంతపెద్ద టవర్స్‌ను కూల్చివేశారు. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ NBC వివరాల ప్రకారం.. గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్‌ కోర్టులోని టవర్‌కు మధ్య దూరం కేవలం 9 మీటర్లు మాత్రమే ఉంది. అంటే కేవలం 7మీటర్లు తేడాతో ఈభవనం నిర్మించారు. అందుకే కూల్చివేశారు.

ఢిల్లీ ట్విన్ టవర్స్‌ విషయంపై ఎమరాల్డ్‌ కోర్టు నివాసులు 2012లో కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా వీటి నిర్మాణం జరిగిందని అలహాబాద్‌ హైకోర్టు 2014లో తీర్పు ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టులోనూ భవనాలను నిర్మించిన సూపర్‌టెక్‌ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ట్విన్‌ టవర్స్‌ కూల్చివేయాల్సిందేనని ఆగస్టు 31, 2021న కోర్టు తీర్పునిచ్చింది. ఈ రెండు టవర్స్‌ కూడా కుతుబ్‌ మినార్‌, ఇండియా గేట్‌ కంటే చాలా ఎత్తులో ఉన్నాయి. కేవలం 7మీటర్ల తేడాతో కట్టిన అంతపెద్ద ట్విన్ టవర్స్‌నే కూల్చివేయగా…చెరువులపై నిర్మాణాలు చేస్తే ఊరుకోవాలా….? కోర్టులు అందుకు సమర్ధిస్తాయా…లేదు కదా. కబ్జాలు చేసి…చెరువులను ఆక్రమించి కట్టేసి..తర్వాత కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్‌లతో కాలయాపన చేయవచ్చు అనుకునేవారికి అతిపెద్ద గుణపాఠం..ఢిల్లీ ట్విన్ టవర్స్.

హైడ్రాకు ప్రజల మద్దతు :

చెరువులు, కుంటల పరిరక్షణకు దిగిన హైడ్రాకు ప్రజల మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఓ పాఠమే. 2014నుంచి నోటీసులిచ్చినా…అక్రమంగా కట్టారని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినా నాగార్జున పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఎన్ కన్వెన్షన్ నిర్మాణం విషయంలో చాలా ఏళ్లుగానే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే కోర్టుల విచారణ కారణంగా ఇంతకాలం నాగార్జునకు ఊరట లభిస్తూ వచ్చింది. హైడ్రా దూకుడు నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ నేలమట్టమయ్యింది. హైడ్రా నిర్ణయం చట్టవిరుద్ధమన్న నాగార్జున.. దీనిపై చట్టబద్ధంగా పోరాడుతానని ప్రకటించారు. అయితే ఆక్రమణలకు పాల్పడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా స్పష్టమైన హెచ్చరికలు పంపింది.  సీఎం రేవంత్ రెడ్డి  చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలపై దృఢనిశ్చయంతో ఉన్నారు. అందుకే ప్రజల నుంచి హైడ్రాకు ఫుల్ సపోర్ట్ వస్తోంది. హైడ్రాకు హ్యాట్సాఫ్ చెబుతూ…గండిపేట వెల్ఫేర్ సొసైటీ సపోర్ట్ వాక్ కూడా నిర్వహించింది. సపోర్ట్ వాక్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రజలు మద్దతు తెలిపారు. ఈ వాక్‌లో భారీగా స్థానికులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. చెరువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మనది హైడ్రా మనందరిదీ అనే నినాదాలు చేశారు.

ప్రజల ముందు హైడ్రా రిపోర్ట్‌ :

ఇంతవరకూ 18 చోట్ల చెరువుల్ని ఆనుకుని నిర్మించిన 43 ఎకరాల స్ట్రక్చర్స్ హైడ్రా బుల్డోజర్ల నేలమట్టం చేశాయి. ఒక్క గండిపేట చెరువులోనే 15 ఎకరాల ఆక్రమణలు తొలగించేసింది హైడ్రా. ఇంతవరకూ జరిగిన కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్‌ రిపోర్ట్‌ వచ్చేసింది. ఎన్ని అక్రమ కట్టడాలు నేలకూలాయి.. వాటిని అక్రమంగా కట్టిందెవరు.. వాటిని ఎందుకు కూల్చాల్సి వచ్చింది.. అనే డీటెయిల్స్ అన్నీ జనం ముందుంచింది హైడ్రా. హైడ్రా నివేదిక ప్రకారం 18 ప్రాంతాల్లో ఇప్పటివరకు కూల్చివేతలు జరిపింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుంది. నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌, ప్రో కబడ్డీ యజమాని అనపమకు చెందిన భవనాన్ని కూల్చివేసినట్లు వివరించింది. కావేరి సీడ్స్‌ యజమాని భాస్కరరావు, మంథని బీజేపీ నేత సునీల్‌రెడ్డి, బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్‌ మీర్జా, నందగిరిహిల్స్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మద్దతుదారుడు, చింతల్‌లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్‌ నేత పళ్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాల్ని కూల్చివేసినట్లు తెలిపింది.

కానీ ఇదంతా ట్రైలర్‌ మాత్రమే..ఇకముందుంది అసలు సినిమా అన్న సంకేతాలు పంపుతోంది హైడ్రా. ఇప్పటికే పలు పొలిటికల్ లీడర్ల హౌస్‌లకు, ప్లాట్స్‌కు నోటీసులు కూడా పంపింది. హైదరాబాద్‌ శివారు జోడిమెట్లలోని నాదం చెరువు.. పొలిటికల్‌గా టాప్‌ లేపుతోందిప్పుడు. బఫర్‌ జోన్‌లో అనురాగ్‌ వర్సిటీ నిర్మించారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌పై ఫిర్యాదులందాయి. ఇందుకోసం జోడిమెట్ల నుంచి కాలేజీ వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేశారని కూడా కంప్లయింట్ ఉంది. నాదెం చెరువు కబ్జాకు గురైందన్న ఆరోపణలపై హైడ్రా ఏం చెయ్యబోతోందన్నదానిపైనా ఆసక్తి రేపుతోంది.

పులిమీద స్వారీ చేస్తున్నారా?

బడా బాబులు ఉండే చిత్రపురి కాలనీపైనా ఫోకస్ పెట్టింది హైడ్రా. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులు పంపారు. జీవో 658కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన 225 విల్లాలపై సీరియస్‌ అయ్యారు. జీ+1 నిర్మాణానికి అనుమతులు తీసుకుని… జీ+2 నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే… కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలంటూ చిత్రపురి సొసైటీ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో… మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో టెన్షన్‌ మొదలైంది.మరోవైపు ఇదే దూకుడు సొంత పార్టీ నేతల ఫాంహౌస్‌లపైనా ప్రదర్శిస్తారా అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విపక్షాల విమర్శలకు సమాధానం అన్నట్లు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా హైడ్రా నోటీసులు అందుకోవడం ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టు హిమాయత్ సాగర్ చెరువులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, వివేక్‌ వెంకటస్వామి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. అవన్నీ చెరువుని కబ్జా చేసి కట్టినవే అన్న వివాదాలు ఉన్నాయి. మరి వాటిని కూలుస్తారా..అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఫార్మ్ హౌజ్ లని కూలగొట్టినా ప్రజలు ఈ లోపాయికారి ఒప్పందం అన్న ప్రచారమూ జరిగే ప్రమాదం ఉంది. సీపీఐ నారాయణ చెబుతున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారా…?

అధికారుల నిర్లక్ష్యానికి సామాన్యుడు బలి :

ప్రస్తుతం సోషల్ మీడియా రూపంలో భారీగా ఫిర్యాదులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. హైడ్రాపై ప్రజల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. నాయకులు, సెలబ్రిటీల భవనాలు, వేలకోట్లు పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్ కు చెందిన వెంచర్లు చాలా వరకు చెరువులను ఆక్రమించి కట్టినవేనన్న ఫిర్యాదులున్నాయి. ఒకే చెరువుగా ఉన్న కాముని చెరువు..రెండుగా చీలింది. మధ్యలో అతిపెద్ద వెంచర్లు వెలిశాయి. ఈవెంచర్‌ వేసింది సిటీలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్ సంస్థ. వేల కోట్ల పెట్టుబడులతో నిర్మించింది. చెరువులను అడ్డంగా ఆక్రమించుకుని…అపార్ట్‌మెంట్లు కట్టి సామాన్యుల దగ్గర కోట్లు గుంజి తనపని ముగించుకుంది. కానీ హైడ్రా వీటిని కూల్చివేస్తే పరిస్థితి ఏంటి..? అన్న ప్రశ్న తలెత్తుతోందిప్పుడు.

కూకట్‌పల్లి కాముని చెరువు బఫర్‌జోన్‌లో వెలిసిన రాఘవేంద్ర కాలనీలో జీరో పర్మిషన్‌తో భారీ భవన నిర్మాణం జరిగాయి. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయాయి. మొదటగా చెరువు బఫర్‌ జోన్‌లో చిన్న చిన్న రేకుల రూములు నిర్మించి స్థలాలను ఆక్రమించారు. తర్వాత పక్కా భవన నిర్మాణాలు చేసుకుని దర్జాగా ఆ ఇంట్లో నివాసముండటం.. మరికొందరు లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం పరిపాటిగా మారింది.

మాములుగా కాలనీలు, బస్తీలలో అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నా స్థలాలలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆర్కెటెక్చర్‌ను సంప్రదించి భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాను సిద్ధం చేసుకుని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అనుమతి తీసుకొని నిర్మాణ పనులు చేపడతారు. కానీ చాలా ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు.. జీరో పర్మిషన్‌తో భారీ భవన నిర్మాణం జరిగినా జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

నాగార్జున వల్లే కాలేదు.. సామాన్యుల సంగతేంటి ?

నాగార్జున ఒక సెలెబ్రిటీ. ఒక ఆస్తి పోతే ఆయనకొచ్చిన ఇబ్బిందిలేదు. అదే సామాన్యుడు తెలిసో తెలీకో చెరువు మీద కట్టిన ఇల్లు కొనుక్కుంటే, ఇదే హైడ్రా వాళ్లు అతని మీద పడితే అన్యాయం కాదా అన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు చెరువు మీద ఇల్లు కట్టడం అక్రమం కదా అంటే, ఇక్కడ ఆవేశం కన్నా ఆలోచనతో చూడాల్సిన అంశం ఉందనే చర్చా సాగుతోంది. చెరువు మీద కట్టడం కచ్చితంగా అక్రమమే. అయితే అలా కట్టొచ్చని అనుమతి ఇచ్చిన సంస్థలు ఒకటి కాదు- హెచ్ ఎం డి యే, జీ హెచ్ ఎం సీ, రెవెన్యూ శాఖ, ఇర్రిగేషన్ శాఖ.. ఇలా అనేకముంటాయి. ఈ శాఖలన్నీ అనుమతులిస్తేనే ఎవరన్నా కట్టగలుగుతారు. లంచమిచ్చి దొంగ అనుమతులు తెచ్చుకుని ఉండొచ్చు ..అయితే అన్ని శాఖల్నీ చేతులు తడిపి అనుమతులు తెచ్చేసుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమయింది అనుకున్నా, ప్రభుత్వశాఖ అధికారి సంతకంతో ఉన్న డాక్యుమెంట్ చట్టబద్ధమే కదా ..అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

HYDRA

ఫ్లాట్ కొనుక్కునే వారికీ బిల్డర్ అనుమతి పత్రాలు చూపిస్తూ..ఆపత్రాలను బేస్ చేసుకుని బ్యాంక్ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి, అంతా ఓకే అనుకున్నాకే కదా లోన్ ఇస్తారు. మరి అంత పకడ్బందీగా జరిగే విధానాన్ని ఎలా చూడాలి…అన్న చర్చా జరుగుతోంది. ఇవన్నీ ఉన్నా కూడా కబ్జా అని అనిపిస్తే కూలగొట్టేయమని అధికారాలిస్తూ హైడ్రాని ప్రవేశపెట్టడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నవారున్నారు. అలా అడుగుతున్నవారు చెరువు పక్కన కట్టిన అపార్ట్మెంట్లల్లో ఫ్లాట్స్ కొనుక్కుని అందులో ఏళ్ల తరబడి జీవిస్తున్నారు. ప్రభుత్వం వాళ్ల చేత ఆస్తిపన్ను కట్టించుకుంటోంది, కరెంట్ కనెక్షన్ ఇచ్చింది, రోడ్లు వేసింది, మంచి నీటి కనెక్షన్ ఇచ్చి వాటర్ బిల్ కట్టించుకుంటోంది.. ఇప్పుడు సడన్ గా వచ్చి “ఇది అక్రమ కట్టడం.. కూల్చేస్తాం..” అని బుల్డోజర్లు తీసుకొస్తే పరిస్థితి ఏమిటి? ఎవరికి చెప్పుకోవాలి? నాగార్జునకే పని జరగలేదు. సామాన్యుల సంగతేంటి ? అన్న వాదనా వినిపిస్తోంది. చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూనే.. చెరువుల ఆక్రమణలు తెలియక కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.

వాటిని కూడా కూల్చేస్తారా?

ప్రస్తుతానికి నిర్మాణంలోనే ఉండి ఇంకా ఆక్యుపై చేయని ఫ్లాట్లు, ఎన్-కన్వెన్షన్ లాంటి కమర్షియల్ హాల్, ఏవో కొన్ని ఫార్మ్ హౌజులు తీసేస్తే తీసేయొచ్చు గాక. కానీ ఇదే ఊపుతో చెరువుల చుట్టూ ఉన్న ఇళ్లల్లొ నివాసముంటున్న సామాన్యుల జోలికొస్తే పరిస్థితి ఏంటి…అన్న ప్రశ్నా వినిపిస్తోంది. ఇది నిజంగా పులిమీద స్వారీ లాంటిదే . కానీ రేవంత్‌రెడ్డి సర్కార్ ఇలాంటి విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. సీఎం హైడ్రా మీద చాలా స్పష్టంగా ఉన్నారు. ఇదే దూకుడు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయన్న సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చేశారు. ఇదే తరహాలో దూకుడుగా చూపిస్తే మణికొండలో చాలా ఇళ్లు ఎగిరిపోయే ప్రమాదం ఉంది. అక్కడా చెరువులపక్కన కట్టినవి వందల్లో ఉన్నాయి. పైగా అక్కడ సినీప్రముఖుల ఇళ్లు అనేకమున్నాయి.

ఇక హైదరాబాద్ మహానగరంలో ఘనకీర్తి గాంచిన మీర్‌ ఆలం చెరువు కూడా కబ్జా కోరల్లో ఉంది. రెండు శతాబ్దాల క్రితం అప్పటి హైదరాబాద్ ప్రధాని మీర్‌అలం చెరువుకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి.. నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నీళ్లు స్వచ్ఛంగా ఉండటంతో… నిజాం నవాబులు సైతం వినియోగించేవారు. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు రోజు రోజుకి కబ్జాలతో కుంచించుకుపోయిది. గతంలో అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా కబ్జా ఆగలేదు. ఆక్రమణకు గురవుతూనే ఉంది. అయితే అలాగే హైడ్రా కూల్చివేతలను ఎంఐఎం తప్పుబడుతోంది. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన గవర్నమెంట్ ఆఫీసులను కూడా కూల్చివేస్తారా అని నిలదీశారు.

ప్రతిపక్షాల రివర్స్‌ ఎటాక్‌:

హైడ్రా కూల్చివేతలన్నీ డైవర్ట్ పాలిటిక్స్‌లో భాగమన్నది విపక్షాల వాదన. రైతుల ఋణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే హైడ్రాను తెరపైకి తెచ్చారంటోంది బీఆర్ఎస్. కక్షసాధింపుల చర్యలో భాగంగా జరుగుతున్న కూల్చివేతలు తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదంటున్నాయి విపక్ష పార్టీలు. అయితే ఇందులో ఎలాంటి కక్షసాధింపులేదంటోంది కాంగ్రెస్ సర్కార్. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియగా ఉందన్నారు మంత్రి పొన్నం. కూల్చివేతలు జరిగిన ప్రతి సందర్భంలో విమర్శలు, ప్రశంసలు కామనే.

లౌక్‌డౌన్ సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగింది. దాదాపు 40భవనాలు అక్రమంగా కట్టినట్లు జీహెచ్‌ఎంసీ నిర్ధారించి కూల్చివేసింది. అయితే అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణాలపై కథనాలు వచ్చినప్పుడల్లా సామాన్యుల భవనాలనే కూలుస్తున్నారు. బడాబాబుల పెద్ద భవనాలను మాత్రం వదిలేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చేవి. ప్రస్తుతం సామాన్యుల అపార్ట్‌మెంట్లే కాదు..బలిసినోళ్ల విల్లాలు, ఫాంహౌస్‌లను కూడా హైడ్రా కూల్చివేస్తోంది.

Hydra Demolition

GO 111 పరిధిలోనూ ఉక్కుపాదం?

రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే కేవలం హైడ్రాతోనే సరిపెట్టేలా కనిపించడంలేదు. 111జీవోపైనా ఉక్కుపాదం మోపుతారన్న సంకేతాలు వస్తున్నాయి. 111జీవో…సరిగ్గా ఏడాది క్రితం వరకు తెలంగాణలో ఇదో హాట్ టాపిక్‌. సామాన్యుల నుంచి బడా రియల్టర్ల వరకు దీనిపైనే తీవ్రంగా చ‌ర్చించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రిపుల్ వ‌న్ జీవో ప్లేస్‌లో కొత్తగా 69 జీవోను విడుద‌ల చేసింది. ట్రిపుల్ వ‌న్ జీవో ర‌ద్దు అంటూ ప్రచారం కూడా జరిగింది. ల‌క్షా 30వేల ఎక‌రాల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామ‌ని.. గ్రీన్ సిటీగా డెవ‌ల‌ప్ చేస్తారన్న ప్రచారమూ జరిగింది.

అయితే ట్రిపుల్ వ‌న్ జీవోను ర‌ద్దు చేయ‌డంపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు. ట్రిపుల్ వ‌న్ జీవోను ర‌ద్దు చేసిన కేసీఆర్‌, కేటీఆర్‌, సోమేష్ కుమార్‌, అర‌వింద్ కుమార్‌ల‌ను.. అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద గుంజ‌కు క‌ట్టేసి.. రాళ్ల‌తో కొట్టాలంటూ ఆవేశంతో ఊగిపోయారు. మరి హైడ్రాతో దూకుడుమీదున్న సీఎం రేవంత్‌ రెడ్డి. . ట్రిపుల్ వ‌న్ జీవో పై ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్న ఆసక్తి ప్రజల్లో ఉంది.

విద్యాసంస్థల విషయంలో ఆచితూచిః

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు. అలాగే దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజ్ సహా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌ కాలేజీలకు నోటీసులిచ్చారు. చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో కాలేజీలో నిర్మించారంటూ అధికారులు నోటీసులందించారు. మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు ఆక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. ఏడు రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని.. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 489, 485, 484, 492, 489 సర్వే నెంబర్లలో బిల్డింగ్స్‌, షెడ్లు, వెహికిల్ పార్కింగ్‌తో పాటు కాలేజ్ రోడ్లు వేసినట్టు గుర్తించారు అధికారులు. దీంతో కాలేజీలను కూల్చివేస్తారా అన్న చర్చ జోరందుకుంది.

విద్యాసంస్థల నిర్మాణాలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని.. అయితే విద్యార్థుల అకాడమిక్ ఇయర్‌ని దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌. ముందుగా నోటీసులు ఇచ్చి.. గడువు ముగిసిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు. సాధారణ ప్రజలకు ఒకలా.. ప్రజాప్రతినిధులకు మరోలా రూల్‌ ఉండదని.. అందర్నీ ఒకేలా చూస్తామన్నారు. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌ కాలేజీలకు నోటీసులివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.

Hyderabad

ఓవైసీ కొత్త వాదన:

పాతబస్తీ బండ్లగూడలోని సలకం చెరువు 70శాతం కబ్జాకు గురైందన్న ఆరోపణలున్నాయి. 1979 నాటి మ్యాప్ ప్రకారం సలకం చెరువులో 70 శాతం కబ్జాకు గురైనట్టు తెలుస్తోంది. 2014కి ముందు చెరువు చుట్టూ ఎఫ్‌టీఎల్‌లో కొన్ని ప్రైవేట్​ కట్టడాలు నిర్మించుకున్నారని స్థానికులు చెబుతున్న మాట. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చి వేసిన హైడ్రా అధికారుల నెక్స్ట్ టార్గెట్‌ సలకం చెరువు మధ్యలో నిర్మించిన ఒవైసీ విద్యా సంస్థలేనన్న వార్త బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు హైడ్రా తలొగ్గదని.. కబ్జాలకు పాల్పడిన ఎంతటి వారినైనా వదలబోదని హెచ్చరించారు. ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. అవసరమైతే కాల్చేయండి… తన విద్యా సంస్థల జోలికి వస్తే బాగుండదన్న హెచ్చరికలు రాజకీయ దుమారం రేపాయి.

ఎఫ్‌టిఎల్‌ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ సంస్థల్ని కూడా హైడ్రా కూల్చేస్తుందా అని ప్రశ్నించారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. హిమాయత్ సాగర్‌ ఎఫ్‌టిఎల్‌ పరిధిలో సీసీఎంబీ.. హుస్సేన్‌ సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న నెక్లెస్‌ రోడ్‌ను కూడా తొలగిస్తారా అని నిలదీశారు. మరోవైపు సలకం చెరువులో నిర్మించిన ఒవైసీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. ఈ క్రమంలో ఆక్రమణలు, కూల్చివేతలపై రంగనాథ్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కేవలం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని.. విద్యాసంస్థల యజమాన్యాలకు సమయం ఇస్తున్నామన్నారు.

ఇన్నాళ్లు ఎంఐఎం పార్టీ చెప్పిందే శాసనంలా ప్రభుత్వాలు వింటూ వచ్చాయి. మరి ఒవైసీ బ్రదర్స్‌ను కాదని విద్యాసంస్థల్ని కూల్చివేసే అవకాశం ఉందా? అసలు విద్యాసంస్థల నిర్మాణం సక్రమమా? అక్రమమా? ఒకవేళ నేతలకు చెందిన విద్యాలయాల భవనాలను హైడ్రా కూల్చివేస్తే మాత్రం ఇకపై ఎవ్వర్ని వదిలే అవకాశం ఉండదనే చర్చ నడుస్తోంది.

మరోవైపు హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైడ్రా దూకుడుతో అక్రమార్కుల్లో లబ్ డబ్ మొదలైంది. కూల్చివేస్తామని నోటీసులు ఇస్తుండటంతో వాళ్లు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి