ఒకప్పుడు హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేవి.. చార్మినార్, ట్యాంక్బండ్, బిర్లామందిర్లతో డబుల్ డెక్కర్ బస్సులు. హైదరాబాద్కు వచ్చిన వారు కచ్చితంగా ఒక్కసారైనా డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించాలని ఆశపడుతుంటారు. అంతలా హైదరాబాద్ అస్తిత్వంలో ఈ బస్సులు ఓ భాగమైపోయాయి. అయితే కాలక్రమేణా ఆర్టీసీ అధికారులు డబులు డెక్కర్ బస్సులను వినియోగంలో నుంచి తొలగించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం చిన్నారులను, పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంటూ హైదరాబాద్ పర్యాటకంలో ఈ బస్సులు కీలకపాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే ఇప్పడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేయనున్నాయని వార్తలు వస్తున్నాయి. కేవలం వార్తలే కాదు ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ సిటీలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టండని కోరాడు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే నగరంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నగరంలోని మూడు మార్గాల్లో తొలుత వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ త్వరలోనే టెండర్లకు ఆహ్వానించనుంది. ఏయే రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులను నడిపించాలనే దానిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్లైఓవర్స్ లేని మార్గాల్లో వీటిని నడిపించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..