హైదరాబాద్ నగరం అంటేనే ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు నిలయం.. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అద్భుతమైన కట్టడం చార్మినార్ అని చెప్పవచ్చు. 1591లో మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన ఈ కట్టడం భారతదేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన కట్టడాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ కట్టడాన్ని చూడడానికి వచ్చే సందర్శకులకు లెక్కే లేదు. ప్రతిరోజూ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ అద్భుత కట్టడాన్ని చూసి ఫోటోలు కూడా దిగుతుంటారు. ఇక యువతి సంగతి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇక్కడికి వచ్చే యువతీయువకులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తిరగడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు.
ఇదంతా ఇలా ఉండగా.. చార్మినార్ పైభాగంలోకి వెళ్లడానికి గతంలో వీలు ఉండేది కానీ, కొన్ని ఏళ్లుగా ఆ అవకాశాన్ని రద్దు చేశారు. ఒకవేళ వెళ్లినా చార్మినార్ పైనున్న గడియారం వరకు మాత్రమే వెళ్లే వీలుంది. చార్మినార్ పైభాగం నుంచి నగరాన్ని చూసి ఆనందించాలని చాలా మంది ఆసక్తి కనబరిచేవారు. కానీ, ప్రస్తుతం అనుమతి ఇవ్వకపోవడంతో ఎవరికీ వెళ్లే అవకాశం లేదు. అయితే.. ఇటీవల ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో చార్మినార్ పైభాగంలో కనిపించాడు. చార్మినార్కి ఏవైనా మరమ్మత్తులు ఉంటే వెళ్లాడా? లేక ఎందుకు వెళ్లాడనేది స్పష్టత రాలేదు. ఒకవేళ మరమ్మత్తుల్లో భాగంగానే వెళ్లినట్లయితే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని స్థానికలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మామూలు సందర్శకులు అక్కడి వరకు వెళ్లే అవకాశమే లేదు. వెళ్లినా గడియారం వరకు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది. అలా వెళ్లినవాడే అక్కడి నుంచి తప్పించుకుని ఎవరికీ తెలియకుండా పైవరకు వెళ్లిపోయాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆ వ్యక్తి అలా పైభాగంలో ఉన్న సమయంలో చార్మినార్ సందర్శనకు వచ్చిన పలువురు అతన్ని చూస్తూ ఉండిపోయారు. అలా ఎలా వెళ్లాడంటూ ఆశ్చర్యంతో చూస్తూనే ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డు చేసి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏది ఏమైనా ప్రాణాలను ఇరకాటంలో పెట్టే పనులను ఇలా చేయకూడదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.