
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్లో షబ్-ఎ-ఖదర్ జాగ్నేకి రాత్ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. 16, 17వ తేదీల మధ్య రాత్రి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కొన్ని ఫ్లైఓవర్లపై రాత్రి 10 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్యాలయం ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
నగరంలోని నాలుగు ముఖ్యమైన ఫ్లైఓవర్లపై ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. డా. మన్మోహన్ సింగ్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్పై జూ పార్క్ నుండి ఆరంఘర్ వరకు ద్విచక్ర వాహనాలు రాత్రి 10 గంటల తర్వాత అనుమతి ఉండదని తెలిపారు. అలాగే బహదూర్పురా ఫ్లైఓవర్పై దేవి బాగ్ నుండి జూ పార్క్ గేట్ నెంబర్-2 వరకు కూడా ఇదే నిబంధన అమల్లో ఉంటుంది. ఇక చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్పై హషామాబాద్లోని నయారా పెట్రోల్ బంక్ ప్రవేశ ద్వారం నుండి ఫూల్బాగ్ DLRL వరకు కూడా రాత్రి 10 గంటల తర్వాత టూ వీలర్ల రాకపోకలను నిలిపివేస్తారు. అదేవిధంగా డా. ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్పై పిసల్బండా నుండి లక్ష్మారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు కూడా ద్విచక్ర వాహనాలకు ప్రవేశం ఉండదు.
షబ్-ఎ-ఖదర్ సందర్భంగా రాత్రి వేళల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మసీదులకు వెళ్లడం, వాహన రాకపోకలు పెరగడం వంటి కారణాలతో ట్రాఫిక్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు, ప్రయాణికులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన పక్షంలో ట్రాఫిక్ హెల్ప్లైన్ నెంబర్ 9010203626 ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నగరంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి