Hyderabad: శిర్డీ సాయిబాబాకు ఖరీదైన కానుక.. బంగారపు గొడుగు ఇచ్చిన భక్తుడు.. విలువ ఎంతో తెలుసా..?

శిర్డీ సాయిబాబాకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఖరీదైన కానుక ప్రకటించాడు. రూ.75 లక్షల విలువ చేసే భారీ బంగారం గొడుగు విరాళంగా ఇచ్చాడు. దీనిని సాయిబాబా సంస్థాన్‌ ప్రతినిధులకు అందించాడు. ఈ గొడుగు చాలా ప్రత్యేకతను చాటుకుంది. సాయిబాబాపై ఉన్న భక్తితో దీనిని అందించాడు.

Hyderabad: శిర్డీ సాయిబాబాకు ఖరీదైన కానుక.. బంగారపు గొడుగు ఇచ్చిన భక్తుడు.. విలువ ఎంతో తెలుసా..?
Saibaba

Edited By:

Updated on: Sep 16, 2026 | 12:41 PM

శిర్డీ సాయిబాబా భక్తుడి అరుదైన కానుక అందరినీ ఆకట్టుకుంటోంది. అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్‌కు చెందిన సాయి భక్తుడు చంద్రశేఖర్ కమ్మెట్టి.. సుమారు రూ.75 లక్షల విలువైన బంగారు, వెండి గొడుగును సాయిబాబా సంస్థాన్‌కు సమర్పించారు. సాయిబాబాపై తనకున్న అపారమైన భక్తి, విశ్వాసానికి గుర్తుగా ఈ కానుకను అందించినట్లు ఆయన తెలిపారు. చంద్రశేఖర్ కమ్మెట్టి స్వస్థలం హైదరాబాద్. ఉన్నత విద్య కోసం 1998లో అమెరికాకు వెళ్లిన ఆయన.. అదే ఏడాది తొలిసారి శిర్డీకి వచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. అప్పటి నుంచి శిర్డీతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్నప్పటికీ.. ప్రతి ఏడాది నాలుగైదుసార్లు శిర్డీకి వచ్చి సాయిబాబాను దర్శించుకుంటున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. తన జీవితంలోని అనేక సందర్భాల్లో సాయిబాబా తనకు దిశానిర్దేశం చేశారని ఆయన పేర్కొన్నారు.

సాయిబాబా విగ్రహంపై అలంకరించేందుకు, పల్లకీ ఊరేగింపు సమయంలో ఉపయోగించేందుకు ప్రత్యేకంగా ఈ గొడుగును తయారు చేయించారు. అత్యంత కళాత్మకంగా రూపొందించిన ఈ గొడుగులో 250 గ్రాముల స్వచ్ఛమైన బంగారం, 9 కిలోల వెండి వినియోగించారు. గొడుగు మొత్తం బరువు సుమారు 9.25 కిలోలు కాగా.. దీని తయారీకి దాదాపు రూ.75 లక్షలు ఖర్చయినట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ కానుకపై చంద్రశేఖర్ కమ్మెట్టి తన భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. సాయిబాబా తన జీవితంలో ఎన్నో అనుభవాలను అందించారని.. ఈ గొడుగు సమర్పించే అవకాశం కూడా బాబా అనుగ్రహమేనని అన్నారు.

ఈ పవిత్ర కార్యక్రమంలో తాను కేవలం ఒక మాధ్యమంగా ఉండే అవకాశం దక్కడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గొడుగు సమర్పణ కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించిన సాయిబాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గడిల్కర్‌కు చంద్రశేఖర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భక్తి ఉంటే కానుక విలువలో కాదు.. మనసులో ఉంటుంది. కానీ ఈసారి శిర్డీ సాయిబాబా దర్బారుకు చేరిన ఈ రూ.75 లక్షల గొడుగు మాత్రం భక్తి, కళాత్మకతకు ప్రత్యేక నిదర్శనంగా నిలిచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us