
హైదరాబాద్లో నమ్మి పని ఇచ్చిన వ్యక్తినే చీట్ చేసింది ఓ కిలేడి. ఆపై పోలీసుల వలలో చిక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ ఇంటి పనిమనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. యజమాని ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు ఆరోపణలు రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… బాదంగ్పేట్కు చెందిన అల్లు తేజస్వి(43) హబ్సిగూడలో నివసించే ఓ డాక్టర్ ఇంట్లో పని చేసేది. గత ఏడాది అక్టోబర్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో ఇంటి అల్మారాల్లో ఉన్న బంగారు నగలను దశలవారీగా అపహరించినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల ఇంట్లో నగలు కనిపించకపోవడంతో డాక్టర్ అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి అనుమానితురాలైన తేజస్విని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించగా ఆమె నగలు దొంగిలించినట్లు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి రూ.3.88 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంటి పనిమనిషిపై విశ్వాసం ఉంచిన యజమానికి చివరికి షాక్ తగిలినట్టైంది.