AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో కేబుళ్లు కట్.. నెట్ ప్రొవైడర్స్, ఉద్యోగుల ఫైర్.. అసలు ఏం జరిగిందంటే..?

హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ అధికారులు స్తంభాలపై ఉన్న కేబుళ్లను ఎక్కడికక్కడ కట్ చేస్తున్నారు. దీంతో నెట్ రాక చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు అధికారులు కేబుళ్లను ఎందుకు కట్ చేస్తున్నారు..? దీనిపై నెట్ ప్రొవైడ్ సంస్థలు ఏమంటున్నాయి..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Hyderabad: హైదరాబాద్‌లో కేబుళ్లు కట్.. నెట్ ప్రొవైడర్స్, ఉద్యోగుల ఫైర్.. అసలు ఏం జరిగిందంటే..?
Officials Cut Cables In Hyd
Krishna S
|

Updated on: Aug 19, 2025 | 7:06 PM

Share

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ స్తంభాలపై ఉండే కేబుళ్లను కట్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. విద్యుత్ షాక్ వల్ల ఇటీవల పలువురు మరణించారు. బండ్లగూడలో ఇద్దరు, రామంతాపూర్‌లో ఇద్దరు కరెంట్ షాక్‌తో చనిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ అంశాలపై రివ్యూ నిర్వహించిన భట్టి.. తక్షణమే కేబుళ్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కేబుళ్లను కట్ చేస్తున్నారు. అధికారుల చర్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది నెట్ రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై నెట్ ప్రొవైడర్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కేబుల్ కోతల కారణంగా నగరంలోని పెద్ద సంఖ్యలో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఇంటర్నెట్ కట్‌లతో ఇబ్బందులు పడుతున్నారని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై COAI డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ కేబుల్స్‌ను  విచక్షణారహితంగా కత్తిరించడం వల్ల ప్రజలకు ఇంటర్‌నెట్ అంతరాయం ఏర్పడిందన్నారు. ‘‘ఇంటర్నెట్ కేబుళ్లలో కరెంట్ ఉండదు. కరెంట్ షాకులకు కేబుల్ వైర్లకు ఎటువంటి సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ చర్యల వల్ల నిత్యావసర సేవ అయిన ఇంటర్నెట్ కనెక్టివిటీకి తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.

ఈ అంతరాయం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఉద్యోగులు, ఆన్‌లైన్ విద్యార్థులు, డిజిటల్ సేవలను ఉపయోగించుకునే సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ తరగతులు, వీడియో కాన్ఫరెన్స్‌లు, సాధారణ డిజిటల్ లావాదేవీలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సమస్యను పరిష్కరించడానికి, సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి ఇంటర్నెట్ సేవల సంస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయని COAI తెలిపింది. తెగిపోయిన కేబుల్‌లను గుర్తించి వాటిని మరమ్మత్తు చేయడానికి సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే విద్యుత్ శాఖ తరచుగా కేబుళ్లను కత్తిరించడం వల్ల మరమ్మత్తులు పూర్తయిన వెంటనే మళ్ళీ అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఐఎస్‌పీల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీవోఏఐ విజ్ఞప్తి

భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు పునరావృతం కాకుండా ఉండటానికి, టీజీఎస్‌పీడీసీఎల్ కేబుల్‌లను కత్తిరించకుండా ఉండాలని COAI విజ్ఞప్తి చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ అభివృద్ధిలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తున్నందున, ఇటువంటి చర్యలు డిజిటల్ ఇండియా లక్ష్యానికి ఆటంకం కలిగిస్తాయని వ్యాఖ్యానించింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఒక ముఖ్యమైన సేవ అని, దీనికి అంతరాయాలు లేకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని కొచ్చర్ నొక్కి చెప్పారు.

ఎస్పీడీసీఎల్ సీఎండీతో భేటీ..

మరోవైపు తమను ఇబ్బంది పెట్టొద్దని ఎస్పీడీసీఎల్ సీఎండీని ఇంటర్నెట్ అండ్ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ సభ్యులు కలిశారు. సమస్య పరిస్కరణానికి ఒక ప్రణాళికతో రావాలని అసోసియేషన్ సభ్యులకి సీఎండీ సూచించారు. బుధవారం ఉదయం మరోసారి సీఎండీతో సమావేశం కానున్నారు. రేపు చర్చలు విఫలమైతే తమ కార్యచరణ జేఏసీ సభ్యులు ప్రకటించనున్నారు. అవసరమైతే ఇంటర్నెట్ స్వయంగా నిలిపివేసే యోచనలో ప్రొవైడర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us