
హైదరాబాద్ ప్రజలకు జలమండలి కీలక సూచనలు చేసింది.. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని.. ప్రజలు పొదుపుగా నీటిని వాడుకోవాలని సూచించింది.. ఈ మేరకు జలమండలి కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులోని లింగంపల్లి –బంజారాహిల్స్ వరకు ఉన్న 1000 ఎంఎం డయా మెయిన్ పైప్లైన్కు లీకేజీ ఏర్పడింది. ఈ భారీ లీకేజీలను అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టారు. దీనికి కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడతాయి. ప్రస్తుతం యుద్ధప్రాతిపాదికన మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి.
పనులు పూర్తి కాగానే యధావిధిగా నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. ఈ మేరకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మరమ్మతుల పనులపై తాజా పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్మిషన్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు.
లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు.
ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ, సనత్నగర్, నిమ్స్, బంజారాహిల్స్, వెంకటగిరి, బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, సోమాజిగూడ తదితర ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు – జలమండలి అధికారులు కోరారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..