Hyderabad: 12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. CAకే కుచ్చుటోపి.. ఎలానో తెలిస్తే!

హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు తెప్పిస్తామంటూ, మాయమాటలతో నమ్మించి, కేవలం 12 రోజుల్లోనే ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ. 2.45 కోట్లు కాజేశారు కేటుగాళ్లు. ఈ ఘటన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదులో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: 12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. CAకే కుచ్చుటోపి.. ఎలానో తెలిస్తే!
Cybercrime Hyderabad

Updated on: Aug 14, 2026 | 7:56 AM

కేవలం 12 రోజుల్లో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌ నుంచి రూ.2.45 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. గండిపేటకు చెందిన సీఏ నరసింహారెడ్డిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేశారు. మొదట ఈ-మెయిల్, టెలిగ్రాం యాప్ ద్వారా ఆయనను సంప్రదించిన నిందితులు.. తాము స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎంతో అనుభవం ఉన్న నిపుణులమని నమ్మించారు. తమ సలహాలు, సూచనలతో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే ఊహించని భారీ లాభాలు వస్తాయని ఎర వేశారు.

అధికలాభాలతో వల

నిందితుల మాటలు నమ్మిన నరసింహారెడ్డి సైతం వారు సూచించిన ఒక ట్రేడింగ్ యాప్‌ను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొదటగా రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టగా.. యాప్‌లో రూ. 5 లక్షలు లాభం వచ్చినట్లు చూపించారు. దాని తర్వాత మరో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టించి దానికి రూ. 9.5 లక్షల లాభం వచ్చినట్లు చూపించారు. ఈ విధంగా యాప్‌లో ఫేక్ లాభాలను చూపిస్తూ బాధితుడికి తమపై పూర్తిగా నమ్మకం కలిగేలా చేశారు. భారీగా పెట్టుబడి పెడితే అంతే స్థాయిలో కోట్లలో లాభాలు వస్తాయని మభ్యపెట్టారు.

12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా

ఇక వాళ్లు చెప్పినవన్నీ నిజమేనని నమ్మిన బాధితుడు కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 2.45 కోట్లు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత తన ఖాతాలో ఉన్న డబ్బులు, వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఖాతాలను నుంచి డబ్బులు రాలేదు. దీంతో అనుమానం వచ్చి బాధితుడు నిందితులను ఫోన్ నంబర్లు, ఆన్‌లైన్ ఐడీలను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించగా నిందితుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన గ్రహించిన నరసింహారెడ్డి వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులకు ఫిర్యాదు

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నేరగాళ్లు వాడిన టెలిగ్రాం ఖాతాలు, బ్యాంక్ వివరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us