హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్… లైసెన్స్ లేకుండా బండి ఇస్తే ఇక అంతే.. మరిన్ని తెలుసుకోవాల్సిన విషయాలు..!
విశ్వనగరంగా ఖ్యాతి గడిస్తోంది భాగ్యనగరం.. కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరంలో నిత్యం లక్షలాది మంది తమ అవసరాల కోసం నిత్యం వాహనాలతో రోడ్డెక్కుతుంటారు.
New traffic rules : విశ్వనగరంగా ఖ్యాతి గడిస్తోంది భాగ్యనగరం.. కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరంలో నిత్యం లక్షలాది మంది తమ అవసరాల కోసం నిత్యం వాహనాలతో రోడ్డెక్కుతుంటారు. ఉరుకులు పరుగుల జీవితంతో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఖాతరు చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో ప్రజా భద్రత దృష్ట్యా ఇకపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించారు. రోడ్డు నిబంధనలు పాటించని వారిపై కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా పెరిగిపోయాయి వాహనాలు. వయసుతో సంబంధం లేకుండా మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతున్నారు. అంతేకాదు, మద్యం సేవించి మత్తుతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. స్నేహితుడు వాహనం కొన్నాడనో.. ఇంట్లో గొడవ పెడుతున్నారనో.. లేదంటే మితిమీరిన గారాబంతోనో కొందరు తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు కొనిపెడుతున్నారు. వారికి వాహనం నడిపే అర్హత ఉందా.. లేదా.. పరిశీలించడం లేదు. ఇలా పరోక్షంగా ప్రమాదాలకు తల్లిదండ్రులే కారణమవుతున్నారు,
వనస్థలిపురం పరిధి బీఎన్ రెడ్డి నగర్లో ఓ కారు సృష్టించిన బీభత్సం అంత ఇంతా కాదు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపారు. రోడ్డు పక్కన ఉన్న డివైడర్లను ఎక్కించారు. బారికేడ్లుగా ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలను బలంగా ఢీ కొట్టారు. అక్కడి నుంచి వాహనం ఎగిరి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఆ కారులో ఉన్న ముగ్గురిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
నగర శివారులోని దుండిగల్ ప్రాంతంలో డ్రైవింగ్ లైసెన్సు లేని కుమారుడికి బైకు ఇచ్చాడు ఓ తండ్రి. గత నెల 28న తండ్రి బైక్ తీసుకెళ్లిన తనయుడు ఒకరిని ఢీకొట్టి, అతని మృతికి కారణమయ్యాడు. దీంతో బండి ఇచ్చిన తండ్రిపై ఐపీసీ 304, 109, ఎంవీ యాక్టు 180 ప్రకారం కేసులు నమోదు చేశారు. మరో ఘటనలో సూరారంలో ఓ వ్యక్తి బైక్పై తన తల్లిని తీసుకొస్తుండగా.. పడిపోవడంతో తల్లికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లైసెన్సు లేకుండా నడిపినందుకు ఆ యువకుడిపై పోలీసులు కేసు కేసుపెట్టారు. ఇక, నేపాల్కు చెందిన ఇద్దరు వలస కూలీలు బైక్పై వస్తూ ప్రమాదానికి గురై మృతి చెందారు. లైసెన్సు లేకపోవడంతో వాళ్లకు బైక్ ఇచ్చిన తోటి కార్మికుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
అటు, కూకట్పల్లి హౌజింగ్ బోర్డు పరిధిలో ఓ యువతి ఒండి నడుపుతూ టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందింది. టిప్పర్ డ్రైవర్ను ఏ2గా, ఆమెకు బైక్ ఇచ్చిన యువకుణ్ని ఏ1గా పోలీసులు చేర్చారు. యువకుణ్ని జైలుకు పంపారు. అయినా, చాలా మందిలో మార్పు రావడం లేదు. ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా, ఎన్ని జరిమానాలు విధిస్తున్నా ఏ మాత్రం బాధ్యత లేకుండా, రహదారి భద్రతా నియమాలు పాటించకుండా అడ్డగోలుగా వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదాల సంఖ్యను పెంచుతున్నారు.
ఇదిలావుంటే, తల్లిదండ్రులు పిల్లలు అడిగిందే తడువుగా వాహనాలు కొనిపెడుతున్నారు. మొహమాటానికో, ఇబ్బందికో స్నేహితుల అడగ్గానే వెహికల్స్ ఇస్తున్నారు. వారికి వాహనం నడిపే అర్హత ఉందా.. లేదా.. పరిశీలించడం లేదు. అయితే, హైదరాబాద్ మూడు పోలీసులు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. రూల్స్ ఎవరకు బ్రేక్ చేసినా సహించేదీలేదంటున్నారు. ప్రమాదాలకు పాల్పడితే, వాహనం ఇచ్చిన వ్యక్తులు, తల్లిదండ్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొవల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి.
రోడ్డు ప్రమాదాల నివారణకు నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసు సూచనలు
– రహదారి భద్రతా వారోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
– పాఠశాల, కళాశాలల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
– డ్రంకెన్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
– తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మందుబాబులకు జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తున్నారు.
– నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్న వారి వివరాలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
– నిర్లక్ష్యంగా, తాగిన మత్తులో రోడ్డు ప్రమాదాలు చేసి ఇతరుల మృతికి కారణమైన వారిపై 304 పార్ట్-2 ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.
– 18 ఏళ్లు నిండి.. డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ లైసెన్సులు తీసుకోవాలి.
– మైనర్ల చేతికి బండ్లు ఇవ్వకపోవడం మంచిది.
– తెలియకుండా తీసుకెళ్లినా వెంటనే వెనక్కి రావాలని కోరాలి.
– పిల్లలకు బండ్ల తాళాలు అందుబాటులో లేకుండా చూసుకోవాలి.
– ఎంవీ చట్టం, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. అవసరం లేకుండా బైక్లు కార్లు కొనివ్వొద్దు.