
కడుపున పుట్టిందనే కనికరం కూడా లేకుండా ఓ తల్లి 9 నెలల ముక్కు పచ్చలారని చిన్నారిని చెరువులో ముంచి అతి దారుణంగా మత్య చేసిన ఘటన హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంజాపూర్ గ్రామానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళ ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో తన 9 నెలల కుమార్తె లోకసాని అనురాధను బైరామల్గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి చంపేసింది.
అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో ఆమె తీవ్రంగా మద్యం సేవించి, మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు రాజేశ్వరిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడిందా లేక దీని వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికి.. పిల్లలు లేక ఎందరో అవస్తలు పడుతున్న ఈ రోజుల్లో.. మద్యం మత్తులో కడుపున పుట్టిన, అన్యం పుణ్యం ఎరుగని పసిపాపను తల్లే ఇలా దారుణంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.