GHMC: ఆమ్రపాలి వ్యాఖ్యలపై పారిశుధ్య కార్మికులు ఆందోళన.. ఆ తర్వాత జరిగిందిదే

హైదరాబాద్‌లో చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చేసిన కామెంట్స్‌ కాక రేపాయి. ఆమ్రపాలి వ్యాఖ్యలను నిరసిస్తూ జీహెచ్‌ఎంసీ ముందు స్వచ్ఛ్‌ ఆటో కార్మికులు ఆందోళనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ.. ఆమ్రపాలి ఏమన్నారు?.. కార్మికుల ఆందోళనతో కమిషనర్‌ ఎలాంటి వివరణ ఇచ్చారు?

GHMC: ఆమ్రపాలి వ్యాఖ్యలపై పారిశుధ్య కార్మికులు ఆందోళన.. ఆ తర్వాత జరిగిందిదే
Amrapali Kata

Updated on: Aug 10, 2024 | 11:40 AM

హైదరాబాద్‌లో స్వచ్ఛ్‌ ఆటో కార్మికులు ప్రతి రోజు ఇంటింటికి వచ్చి చెత్త సేకరించాలి.. కానీ.. అలా జరగడం లేదు.. మా ఇంటికి కూడా రావడంలేదు.. దాంతో.. తామూ ఇబ్బంది పడుతున్నామన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి. ఎస్‌.. ఆమ్రపాలి చేసిన ఈ కామెంట్సే కాకరేపాయి.. హైదరాబాద్‌లోని చెత్త సేకరణ విషయంలో ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలతో జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ని చుట్టుముట్టారు స్వచ్ఛ ఆటో పారిశుధ్య కార్మికులు. తమను అవమానించేలా ఆమ్రపాలి మాట్లాడారంటూ.. ఆవేదనతో ఆమె ఆఫీస్‌కి పోటెత్తారు. ఆ్రమపాలి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.

ఇక.. జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ్‌ ఆటో కార్మికుల ఆందోళనతో అలెర్ట్‌ అయిన ఆమ్రపాలి.. కార్మిక సంఘం నేతలతో చర్చించారు. ఆమె కామెంట్స్‌పై వివరణ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జీఐఎస్‌ డిజిటల్‌ బోర్డు ఏర్పాటు విషయంలో ప్రజలను చైతన్యవంతం చేసే క్రమంలోనే మాట్లాడినట్లు చెప్పారన్నారు జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ్‌ ఆటో కార్మికులు. కమిషనర్‌ కామెంట్స్‌తో తాము బాధపడ్డామని.. అయితే.. ఆమె పట్ల తమకు వేరే ఆలోచనలు మాత్రం లేవని స్పష్టం చేశారు జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ్‌ ఆటో కార్మికులు. మొత్తంగా.. చెత్త సేకరణపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కామెంట్స్‌ చేయడం.. స్వచ్ఛ్‌ ఆటో కార్మికులు ఆందోళనకు దిగడం.. ఆపై వివరణ ఇవ్వడంతో సమస్య టీ కప్పులో తుఫాన్‌లా ముగిసిపోయింది.

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..