Hyderabad: స్నాప్లో పులిహోర కలిపి అమ్మాయిలను రూమ్కి పిలుస్తాడు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి ..

మహిళలను సోషల్ మీడియా వేదికగా లక్ష్యంగా చేసుకుని పరిచయం పెంచుకుని, అనంతరం వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగతేజ అలియాస్ నాని స్నాప్చాట్తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి, వారితో సన్నిహిత పరిచయం పెంచుకునేవాడు. నమ్మకం సంపాదించిన తర్వాత వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి వాటిని వైరల్ చేస్తానంటూ బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసేవాడని దర్యాప్తులో వెల్లడైంది.
తాజాగా డీఎల్ఎఫ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ గదికి ఓ మహిళా టెకీకి రప్పించిన నిందితుడు, కత్తితో బెదిరించి ఆమె నగ్న వీడియోలను రికార్డు చేశాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించి రూ.1.10 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురై గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి స్వస్థలం ప్రకాశం జిల్లా సూదివారిపాలెంగా తెలుస్తోంది.
అతడి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లు, బాధితురాలిని బెదిరించేందుకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు, ముగ్గురు యువతుల న్యూడ్ వీడియోలు కూడా అతని సెల్ ఫోన్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మహిళలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు పంచుకోవద్దని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉంటే ఇలాంటి మోసాలు, బ్లాక్మెయిల్ల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.
