
హైదరాబాద్, 01-09-2025: వినాయక నిమజ్జనానికి వెళ్లి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్లో పరిధిలో వెలుగు చూసింది. వినాయక నిమజ్జనం పూర్తి చేస్తూ ఇంటికి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం చెరువులో పడిపోయి వారు మరణించిన ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ తన కుటుంబంతో పాటు స్థానికంగా నివసిస్తున్నాడు. అయితే ఆదివారం వినాయక విగ్రహం ప్రతిష్టించి ఐదురోజులు పూర్తైన సందర్భంగా వెస్లీ కాలనీ వాసుల గణేష్ నిమజ్జనం చేశారు.
అయితే కాలనీవాసులతో పాటు శ్రీనివాస్ కూడా తన కొడుకును తీసుకొని ఆటోలో గణేష్ నిమజ్జనానికి వెళ్లారు. నిమజ్జనం పూర్తి చేసుకున్న తర్వాత కాలనీ వాసులు ఇంటికి చేరుకున్నారు. అయితే శ్రీనివాస్, అతని కుమారుడు మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడంతో కంగారుపడిపోయిన కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వారి ఆచూకీ కోసం వెతడం ప్రారంభించారు.
వినాయకుడిని నిమజ్జనం చేసిన చెరువు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లి తండ్రీకొడుకుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే ఒక చెరువుకు సమీపంలో రాళ్లు చిందరవంరగా కనిపించడంతో వారు ప్రయాణిస్తున్న వాహనం చెరువులో పడిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బందికి పోలీసులు సమాచారం ఇచ్చారు. చెరువులో గాలింపు చేపట్టిన సిబ్బంది తండ్రి-కొడుకుల మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.