హైదరాబాద్ వస్తుండగా దూసుకొచ్చిన బస్సు.. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ముందువెళ్తున్న కారును బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి మహిళ ప్రాణాలు కోల్పోయింది. చౌటుప్పల్ మండలం పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం (జూన్ 06) వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు, ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కు కారులో వస్తున్నారు. కారు చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అతివేగంగా వచ్చి కారును బలంగా ఢీకొట్టింది.
బస్సు వేగానికి కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న మహిళ తీవ్రమైన గాయాలవడంతో అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం అత్యవసరంగా చౌటుప్పల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
