
హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ అనుమానిత కేసు కలకలం రేపింది. సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ అనే విదేశీ ప్రయాణికుడు హైదరాబాద్కు చేరుకోగా, విమానాశ్రయంలో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో అతనికి గతంలో ఎబోలా వైరస్ సోకిన హిస్టరీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ప్రస్తుతం కూడా ఎబోలాకు సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రయాణికుడిని ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. వైరస్ నిర్ధారణ కోసం అవసరమైన రక్త నమూనాలు, ఇతర శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. తుది ఫలితాలు వచ్చిన తర్వాతే అతనికి నిజంగా ఎబోలా వైరస్ ఉందా లేదా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని అంటువ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆరోగ్య తనిఖీలు మరింత కట్టుదిట్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వైద్య వివరాలు, ప్రయాణ చరిత్ర, ఆరోగ్య పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలో నిర్వహించిన స్క్రీనింగ్లో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం..
అయితే, ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం అనుమానిత కేసు మాత్రమేనని ఆరోగ్య శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రయోగశాల పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే అసలు పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఆ ప్రయాణికుడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది సోకిన వ్యక్తుల్లో తీవ్రమైన జ్వరం, బలహీనత, వాంతులు, విరేచనాలు, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే అనుమానం వచ్చిన వెంటనే ప్రత్యేక ఐసోలేషన్లో ఉంచి పరీక్షలు నిర్వహించడం వైద్య ప్రోటోకాల్లో భాగమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి సీసీఎంబీ పరీక్షల ఫలితాలపైనే ఉంది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఈ కేసుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..