
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ యుద్ధం నడుస్తోంది. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తే.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కాషాయం పార్టీ పెద్దలు. ఓటు పెరిగింది గెలుపు మాదేనంటూ కాంగ్రెస్ చెబుతుంటే.. రెఫరెండమన్న సీఎం సొంత సీటు కూడా ఓడిపోయ్యారంటోంది బీజేపీ. బీజేపీకి ఎక్కడా సహకరించలేదని లెక్కలతో చిట్టా బయటపెడుతూ వివరణ ఇచ్చుకుంటోంది బీఆర్ఎస్.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయవర్గాల్లో ఆసక్తి చర్చకు తెరతీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కాషాయం పార్టీ దీటుగా ఎదుర్కొని లోక్సభ ఎన్నికల్లో 8 చోట్ల విజయం సాధించింది. 2019లో వచ్చిన నాలుగు సీట్లుకు మరో నాలుగు అదనంగా సాధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. అటు డబుల్ డిజిట్పై గురిపెట్టిన అధికారపార్టీ 8 చోట్ల విజయం సాధించింది. అయితే అసెంబ్లీలో వచ్చిన ఓట్ల కంటే ఒకశాతం అదనంగా వచ్చాయని.. తమపాలనకు ప్రజా మద్దతు ఉందంటోంది కాంగ్రెస్. అదే సమయంలో బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుని సహకరించడం వల్లే బీజేపీకి 8 సీట్లు వచ్చాయంటున్నారు రేవంత్ రెడ్డి.
ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి అధికారపార్టీ తమపై ఆరోపణలు చేస్తుందని కౌంటర్ ఇచ్చింది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్కు తోడు, కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావించడంతోనే విజయం వరించిందన్నారు బీజేపీ నాయకులు. బీజేపీకి సహకరించిందన్న ఆరోపణల నేపథ్యంలో తమకు వచ్చిన ఓట్ల లెక్కలతో సహా ట్వీట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. నిజంగా సహకరించి ఉంటే 8 చోట్ల కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు ఆ పార్టీ నేతలు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ- కాంగ్రెస్లు సమ ఉజ్జీలుగా నిలబడితే.. ఇటీవల వరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బలం మరింత దిగజారింది. ఇంతకీ ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణలు చెబుతున్న పాఠమేంటి?
ఇది చదవండి: లోక్సభ ఎన్నికలు.. తెలంగాణలో ఎవరెవరు ఏ స్థానంలో గెలిచారు.? మెజార్టీ ఎంతంటే.?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..