
హైదరాబాద్, మార్చి 16: హైదరాబాద్ మహా నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్ డివిజన్ ఆదర్శ్నగర్ కాలనీ సాయిబాబా ఆలయం సమీపంలో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం (మార్చి 15) రాత్రి సుమారు 8 నుంచి 8.15 గంటల మధ్య జరిగినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి (30), తండ్రి సుబ్బయ్య (రిటైర్డ్ ఏఎస్ఐ) ప్రస్తుతంహైదరాబాద్లోని సీఎస్డబ్ల్యూ (CSW) విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన చెంగిచెర్లలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సుధీర్ రెడ్డి తన స్నేహితుడు సంతోష్ నాయక్తో వాట్సాప్ సందేశం విషయంలో ఆదివారం రాత్రి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో సంతోష్ నాయక్ కత్తితో సుధీర్ రెడ్డిపై దాడి చేశాడు. ఈ ఘటనలో సుధీర్ రెడ్డికి కడుపు, ఛాతీ, మెడ భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తస్రావం కావడంతో సుధీర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితుడు సంతోష్ నాయక్ మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్పై పరారయ్యాడు.
దీనిపై సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్తో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి మోర్చురీకి తరలించారు. ఈ హత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.