Hyderabad: తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకు చుక్కెదురు

|

Mar 21, 2025 | 5:14 PM

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టులో శ్యామలకు చుక్కెదురైంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Hyderabad: తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకు చుక్కెదురు
Anchor Shyamala
Follow us on

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి చుక్కెదురైంది.  తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేయగా.. అందుకు కోర్టు నిరాకరించింది.  శ్యామలను అరెస్టు చేయవద్దని పోలీసులకు సూచించిన ధర్మసనం.. విచారణకు సహకరించాల్సిందేనని ఆమెకు స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి శ్యామలను విచారించవచ్చని కోర్టు పోలీసులకు తెలిపింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బెట్టింగ్‌లు, గేమింగ్స్ పేరుతో ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలివ్వడంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. బెట్టింగ్ యాప్స్ యజమానులే టార్గెట్‌గా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న బెట్టింగ్‌ బాధితుల వివరాల సేకరించారు.

ఈ బెట్టింగ్‌ ఊబిలో చిక్కుకుని ఒక్క ఏడాదిలో 25 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల ఆధారంగా… ఆయా బెట్టింగ్‌ యాప్స్ గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇందులో బెట్టింగ్‌ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు. ఇక సెలబ్రిటీల నుంచి కీలక అంశాలు రాబట్టిన పోలీసులు.. ఇప్పటివరకు 108 అక్రమ బెట్టింగ్‌ వెబ్‌సైట్లు బ్లాక్ చేశారు. మరో 133 బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ వెబ్‌సైట్లు తెలంగాణలో యాక్సెస్ కాకుండా.. జియో-ఫెన్సింగ్‌ టెక్నాలజీతో TGCSB చర్యలు తీసుకొంటున్నారు.

మరోవైపు బెట్టింగ్‌ యాప్స్ కేసులపై పోలీస్‌శాఖ లీగల్ ఒపీనియన్‌కు వెళ్తుంది. సినీ ప్రముఖుల విషయంలో న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్స్‌తో.. భారీగా లబ్ధి పొందిన సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లుకు బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఏ విధంగా డబ్బులు అందాయి, ఏయే మార్గాల్లో ఈ డబ్బులు ప్రమోటర్లు తీసుకున్నారనే కోణంలో.. వారి బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేసులు నమోదైన వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలపై కూడా పోలీసులు ఓ కన్నేసినట్లు సమాచారం.

మరోవైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, తేస్టీ తేజ, కిరణ్‌గౌడ్‌ను పోలీసులు విచారించారు. అజయ్ సన్నీ, సుప్రీత, సన్నీ సుధీర్‌ ఫోన్లు స్విచాఫ్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు అందుబాటులోకి రాలేదు. ఇక విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోర్టుకు వెళ్లిన శ్యామలకు చుక్కెదురైంది . శ్యామలను అరెస్ట్‌ చేయోద్దని పోలీసులకు సూచిస్తూనే..  విచారణకు సహకరించాలని ఆమెను ఆదేశించింది కోర్టు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.