మాదకద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. నగరంతో సహా నగరం నలుమూలల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలలో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు పోలీసులు. తాజాగా తెలంగాణ ఎక్సైజ్ అధికారులు చేసిన దాడుల్లో భాగంగా కొంతమంది స్టూడెంట్స్ గంజాయి అమ్ముతుండగా పట్టుబడ్డారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పెంచి విద్యాబుద్ధులు నేర్పించి.. ఉన్నత విద్య కోసం హైదరాబాద్కు పంపిస్తే.. చదువులను గాలికి వదిలేసి జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మకాలకు దిగిన యువకుల ఉదంతమిది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, ఒరిస్సా బార్డర్లో రూ. 4000 వేలకు కిలో చొప్పున కొనుగోలు చేసుకొని వచ్చి హైదారాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎక్కువ ధరలకు అమ్మకాలు సాగిస్తున్న ముగ్గురు పెద్దపల్లి యువకులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబడ్డారు. మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరిండెంట్ పరిధిలోని ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ పరిధిలో 5.317 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
హైదారాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో గంజాయిని అమ్మకాలు జరుపుతుండగా 100 గ్రాముల గంజాయితో పట్టుబడ్డారు. పట్టుబడిన యువకులు జైపురి కాలనీలో నివసిస్తున్నారు. వారి నివాసంలో తనిఖీలు చేయగా 5.217 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ గంజాయిని అప్పనపేటకు చెందిన ఆకుల మిత్ర చైతన్య, నిట్టూరుకు చెందిన మహ్మమద్ లతీఫ్తో పాటు ఇల్లకుంటకు చెందిన దామ్మని అరవింద్ అమ్ముతూ పట్టుబడ్డారు. ఈ గంజాయిని పెద్దపల్లికి చెందిన బండి సాయిచరణ్ విశాఖ సీలేరు నుంచి రూ. 4000 వేల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకువచ్చి అమ్మకాలు చేశారని పోలీసులు తెలిపారు. గంజాయికి యువత బానిస అవ్వడమే కాదు.. జల్సాలకు కూడా అలవాటుపడి చదువు పేరిట హైదరాబాద్ నగరానికి చేరుకొని తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ చివరకు నిందితులుగా మారుతున్నారు. గంజాయి అమ్ముతూ స్టూడెంట్స్ పట్టుపడటంతో సీరియస్ అయిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..