Shaikpet Flyover: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయి.. షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ మహా నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అతి పొడవైన ఆరు లేన్ల షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు.

Shaikpet Flyover: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయి.. షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Ktr

Updated on: Jan 01, 2022 | 1:16 PM

Shaikpet flyover inaugurated by KTR: కొత్త ఏడాదిలో పాత, కొత్త నగరాలను కలిపే ఫ్లై ఓవర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. షేక్‌పేట ప్లైఓవర్‌ ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు మంత్రి. ఏడున్నారేళ్లుగా SRDP కింద హైదరాబాద్ మహానగరంలో 24 కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామన్న మంత్రి.. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా చాలా పురోగతి సాధించాం. ఇంకా చేయాల్సింది ఉందన్నారు. RBI ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ దేశానికి ఆర్థిక అభివృద్ధిలో నాలుగోవ పెద్ద రాష్ట్రంగా గుర్తింపునిచ్చిందన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుందని మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు వస్తే దేశంలో భాగ్యనగరంను మించిన నగరం ఏది ఉండదన్నారు. రసూల్ పురా జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించేందుకు కేంద్రం సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. అలాగే, కంటోన్మెంట్ ఏరియాలో రోడ్లు మూసివేత స్థానికులకు ఇబ్బందిగా మారిందన్నారు. కిషన్ రెడ్డి రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి కంటోన్మెంట్ రోడ్లు తెరిచేలా చొరవ తీసుకోవాలన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడేందుకు స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ కు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకురావాలన్న కేటీఆర్.. భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన హైదరాబాద్ ను అందించాల్సిన అవసరముందన్నారు.

దీంతో హైదరాబాద్ మహా నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అతి పొడవైన ఆరు లేన్ల షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను శనివారం ఉదయం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు రూ.333.55 కోట్లతో 2.71 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. దాదాపు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లుగా టూ వే ట్రాఫిక్‌ను ఏర్పాటు చేశారు. షేక్‌పేట్ ఫ్లైఓవర్ ప్రధానంగా నాలుగు ప్రధాన జంక్షన్లను కవర్ చేయనుంది. షేక్‌పేట్, ఫిలింనగర్, ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్‌లు దాటి నేరుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది.


ఇదిలావుంటే, హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్‌ ప్రారంభం మరో శుభపరిణామమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. త్వరలో హైదరాబాద్‌లో నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, శంఖుస్ధాపనలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.