
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలోనే అదనపు కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. వీలైనంత త్వరగా ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రయత్నాలను షురూ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న కోచ్లు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా లేవు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండటం లేదు. దీంతో చాలామంది నిల్చోని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ట్రైన్లకు అదనపు కోచ్లను జోడించడం వల్ల మరింతమంది ప్రయాణికులు కూర్చోని ప్రయాణం చేయవచ్చు. అలాగే ఎక్కువమంది ప్రజలు రైళ్లల్లో ప్రయాణించడానికి వీలుంటుంది. ప్రస్తుతం ఒక రైల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తర్వాతి ట్రైన్ కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. అదనపు కోచ్లు ప్రవేశపెడితే ఆ అవసరం ఉండదు.
మెట్రో కోచ్ల కొనుగోలు కోసం డీఎంఆర్సీని కన్సల్టెంట్గా నియమించాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే డీఎంఆర్సీ కొటేషన్లు దాఖలు చేయగా.. మెట్రో అధికారులు పరిశీలించి త్వరలో ఆమోదం తెలపనున్నారు. దేశంలో మెట్రో కోచ్లను తయారుచేసే సంస్థలను గర్తించడం, వాటి సామర్థ్యాన్ని పరిశీలించడం, కోచ్ స్పెసిఫికేషన్లను ఖరారు చేయడం వంటి వాటిపై సాంకేతిక సహకారాన్ని డీఎంఆర్సీ అందించనుంది. అయితే ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండేందుకు హెచ్ఎంఆర్ఎల్ కూడా స్వయంగా రంగంలోకి దిగింది. దేశీయంగా మెట్రో కోచ్లను తయారుచేసే సంస్థలను గుర్తించే పనిలో పడటంతో పాటు ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. సంస్థలు ముందుకొస్తే వారి నుంచి కోచ్లను తీసుకోనుంది. రద్దీ ఎక్కువగా ఉన్న మెట్రో రైళ్లకు వీటిని జోడించనుంది.
తొలి దశలో రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం మార్గాల్లోని రైళ్లల్లో అదనపు కోచ్లను ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత విడతల వారీగా మిగతా రైళ్లల్లోనూ అందుబాటులోకి తీసుకురానుంది. దీని వల్ల ప్రయాణికులు అసౌకర్యాన్ని గురి కాకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. అటు పాతబస్తీ మెట్రో కారిడార్పై కూడా అధికారులు దృష్టి పెట్టారు. ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట మధ్య 7.5 కిలోమీటర్ల ప్రాజెక్టుపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆస్తుల సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత టెండర్లను ఆహ్వానించనున్నారు. అనంతరం నిర్మాణ పనులను మొదలుపెట్టనున్నారు. టెండర్కు సంబంధించిన సాంకేతిక అంశాలను డీఎంఆర్సీ మరో రెండు వారాల్లో ఖరారు చేయనుందని తెలుస్తోంది. అటు తొలి దశ మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. రీఫైనాన్స్ వ్యవహారాలను ఎస్బీఐ క్యాప్స్ పర్యవేక్షిస్తోంది. త్వరలోనే పూర్తిగా స్వాధీన ప్రక్రియ ముగియనుందని తెలుస్తోంది. ఇప్పటికే మెట్రోకు సహకారం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చింది.