
హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న మూసీ నది ప్రమాదకరమైన మలుపులకు, మురికి నీటికి పెట్టింది పేరు. అలాంటి నదిలోకి ప్రమాదవశాత్తు ఓ మహిళ జారిపడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ధైర్యం కోల్పోకుండా పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఉత్కంఠభరితమైన ఘటన భాగ్యనగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
హైదరాబాద్లోని బాలాజీ నగర్కు చెందిన బాలమణి అనే మహిళ రోజు వారీ పనుల్లో భాగంగా చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జి సమీపంలోని మూసీ కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ ముఖం కడుక్కోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె కాలుజారి ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో పడిపోయారు. చూస్తుండగానే నీటి ప్రవాహం ఆమెను ముందుకు లాక్కెళ్లిపోయింది.
మూసీ కాలువ కేవలం నీటి ప్రవాహమే కాదు, అక్కడ విషపూరితమైన పాములు, అప్పుడప్పుడు మొసళ్లు కూడా కనిపిస్తుంటాయి. నీటిలో పడిపోయిన బాలమణికి ఈ విషయం తెలుసు. ఒకవైపు నీటి ఉధృతి, మరోవైపు ప్రాణాంతక జంతువుల భయం ఆమెను చుట్టుముట్టాయి. కానీ, ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తూ.. సహాయం కోసం ఆక్రందనలు చేసింది. మరోవైపు దొరికిన ఆధారాలను పట్టుకుంటూ ప్రాణాల కోసం పోరాడారు.
ఆమె అరుపులు విన్న వెంటనే స్థానికులు స్పందించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన స్థానికులు చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. తామే స్వయంగా రంగంలోకి దిగి రక్షణ చర్యలు ప్రారంభించారు. స్థానికులు వెంటనే తాళ్లు, పొడవైన కర్రలను సేకరించి కాలువలోకి వదిలారు. సమాచారం అందిన నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు, స్థానికులు కలిసి ప్రాణాలకు తెగించి పోరాడుతున్న బాలమణిని చాకచక్యంగా గట్టుకు చేర్చారు.
నీటి నుంచి బయటపడిన బాలమణి భయంతో వణికిపోయినప్పటికీ, ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. పోలీసులు ఆమెను ప్రాథమిక చికిత్స నిమిత్తం తరలించి, ఆమె వివరాలు సేకరించారు. కేవలం అజాగ్రత్త వల్ల జరిగిన ఈ ప్రమాదం నుంచి ఆమె బయటపడటం ఒక అద్భుతమని అక్కడి వారు చర్చించుకున్నారు. ప్రమాదం ఎటు నుండి వస్తుందో తెలియదు, కానీ గుండె ధైర్యం ఉంటే మృత్యువు అంచు దాకా వెళ్లి కూడా తిరిగి రావచ్చు అని బాలమణి ఉదంతం నిరూపించింది. సమయానికి స్పందించిన పోలీసులను, స్థానికులను నగరవాసులు అభినందిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..