Hyderabad: మెరిసేదంతా బంగారం కాదు బ్రో.. బయట తినే ముందు కచ్చితంగా ఇది తెలుసుకోండి
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ కల్తీ రాయుళ్లు పెరిగిపోతున్నారు. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా నగరంలోని మంగళ్హాట్, మల్లెపల్లి, చార్మీనార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లోని పలు అవుట్లెట్లపై దాడి చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ మొత్తంలో గడువు ముగిసిన ఉత్పత్తులతో పాటు కృతిమ కలర్స్ కలిపిన కల్తీ ఆహారాలను స్వాధీనం చేసుకున్నారు.

భాగ్యనగరంలో కల్తీ ఆహార విక్రయదారులు, నిబంధనలు ఉల్లంఘించే సంస్థల గుండెల్లో ‘హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్’ వణుకు పుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తూ, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న పలు ప్రముఖ ఫుడ్ అవుట్లెట్లు, సూపర్మార్కెట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మంగళ్హాట్, మల్లెపల్లిలోని పలు షాప్లపై తనిఖీలు చేపట్టిన అధికారులు భారీ మొత్తంలో కల్తీ ఆహారాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ జూన్ 25న మల్లేపల్లిలోని ఫేమస్ ఫిష్ ఫ్రై అనే రెస్టారెంట్లో తనిఖీలు చేయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. గడువు ముగిసినప్పటికి ఆరెస్టారెంట్ అదే ట్రెడ్ లైసెన్స్ను అప్డేట్ చేయకుండా కొనసాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే అక్కడి ఆహార తయారీలో కృత్రిమ రంగులను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. వాటికి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కు పంపించారు.
ఇక ఇదే బృందం జూన్ 19న చార్మినార్ సమీపంలోని అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అనే మరో చికెన్ అవుట్లెట్లో తిఖీలు చేపట్టగా అక్కడ కూడా భారీ మొత్తంతో నిషేధిత కృత్రిమ ఆహార రంగులతో పాటు వాడిన నూనెనే మళ్లీ వాడుతున్నట్టు గుర్తించారు. అంతేకాదు అవుట్ మొత్తం మురికిగా ఉందని.. సరైన శుభ్రతా ప్రమాణాలను కూడా సదురు సిబ్బంది పాటించట్లేదని అధికారులు తెలిపారు. అక్కడి నుండి 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 19 లీటర్ల వంట నూనె, కెమికల్ కలర్స్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని స్టేషన్ను తరలించారు.
మంగళ్హాట్లోని సూపర్మార్కెట్లో సోదాలు
ఇదిలా ఉండగా మరో బృందం మంగళ్హాట్లోని ఓ సూపర్మార్కెట్లో తనిఖీలు చేయగా అక్కడ నిబంధనలను విరుద్ధంగా ఆహార ఉత్పత్తులను రీప్యాకింగ్ చేస్తున్నట్టు గుర్తించారు.ఆహార ఉత్పత్తులపై సరైన లేబుళ్లు లేవని.. అలాగే ఫుడ్ సేఫ్టీ రికార్డ్స్ కూడా లేవని గుర్తించారు. అలాగే ఎక్సపైర్ అయిన ఆహారం డెలివరీ చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో చంద్రాయణగుట్టలోని జెప్టో గిడ్డంగిపై సోదాలు నిర్వహించారు అధికారులు. అక్కడ భారీ మొత్తంలో గడువు ముగిసిన అనేక ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
