Hyderabad: బుల్లెట్ ట్రైన్ మాకొద్దు.. ఆ గ్రామంలో ఆందోళనకు దిగిన జనాలు.. ఎందుకంటే?

అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టుకోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా కొందరు రైతులు దానికి అభ్యతరం వ్యక్తం చేశారు. తమకు బుల్లెట్ ట్రైన్ వద్దని.. ఈ ప్రాజెక్టుకోసం తమ భూములు ఇచ్చేది లేదని స్పస్టం చేశారు.

Hyderabad: బుల్లెట్ ట్రైన్ మాకొద్దు.. ఆ గ్రామంలో ఆందోళనకు దిగిన జనాలు.. ఎందుకంటే?
Bullet Train Land Acquisition

Edited By:

Updated on: Jul 18, 2026 | 8:03 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహుద్దుర్‌గుడా గ్రామంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ అంశం ఉద్రిక్తంగా మారింది. భూముల స్వాధీనం ప్రక్రియలో భాగంగా హైడ్రా అధికారులు గ్రామానికి చేరుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు భూములను పరిశీలించేందుకు రావడంతో పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తమ భూములను ఇవ్వాలంటే ముందుగా ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నష్టపరిహారం, పునరావాసం, కుటుంబ భవిష్యత్తుపై స్పష్టత లేకుండా భూములు అప్పగించే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు.

గత ఆరు రోజులుగా బహుద్దుర్‌గుడా గ్రామంలో రైతులు నిరంతర ఆందోళన కొనసాగిస్తున్నారు. భూముల వద్దే బైఠాయించి నిరసనలు తెలుపుతూ అధికారుల చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు గ్రామానికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం అధికారులు రైతులతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే, తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. దీంతో బహుద్దుర్‌గుడా భూముల వ్యవహారం మరింత కీలకంగా మారింది.అధికారులు, రైతుల మధ్య చర్చలు ఎలాంటి ఫలితాన్నిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us