Mayor Vijayalakshmi: జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

|

Nov 23, 2021 | 6:16 PM

GHMC Mayor Gadwal Vijayalakshmi: బీజేపీ కార్పొరేటర్లు వారి అనుచరులతో జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి

Mayor Vijayalakshmi: జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
Gadwal Vijayalakshmi
Follow us on

GHMC Mayor Gadwal Vijayalakshmi: బీజేపీ కార్పొరేటర్లు వారి అనుచరులతో జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్య పద్దతిలో అనేక మార్గాలు ఉన్నాయని గుర్తుచేశారు. అయినప్పటికీ మన కార్పొరేషన్ ఆస్తులు మనమే ధ్వంసం చేయడం సరియైన చర్య కాదంటూ మేయర్ వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడంపై బీజేపీ కార్పోరేటర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు విజయలక్ష్మి మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి ఈ విధమైన దాడులకు పాల్పడటం వల్ల.. ప్రజలకు వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుందని మేయర్ విజయలక్ష్మీ అభివర్ణించారు. తనను కలిసేందుకు అపాయిట్మెంట్ ఇచ్చినప్పటికీ రాలేదని.. బీజేపీ కార్పొరేటర్లు ఎందుకురాలేదో సమాధానం చెప్పాలన్నారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించటంలో ఎప్పుడూ రాజీపడటంలేదన్నారు.

తాను నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాలు సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకున్నానని గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఎల్బీనగర్‌ జోన్లోని సరూర్ నగర్ ప్రాంతంలో ఎక్కువ ముంపునకు గురైన సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష చేసి తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భారీ వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశ్యంతో రాత్రింబవళ్లు పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పరిష్కరించామన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు మేయర్ కార్యాలయం నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు.

కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో అయినా జూన్ 29న వర్చువల్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆసమయంలో రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం గురించి బీజేపీ కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే రాజకీయ పరంగా ఈ రోజు ఈ గొడవ చేశారని విజయలక్ష్మి తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు ఇలా చేయడం తగదని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.

Also Read:

E-Rickshaw Driver: 15 క్వశ్చన్లకు ఆన్సర్ చెబితే.. ఆటోలో ఫ్రీగా ప్రయాణం.. రిక్షావాలా జ్ఞానానికి నెటిజన్ల ఫిదా..

AP Crime: చదివేది ఇంజనీరింగ్.. చేసేది దొంగతనాలు.. జల్సాలకు పోయి జైలుపాలయ్యారు