
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మరో గంజాయి రవాణా ముఠా గుట్టు రట్టు చేసింది. ఏకంగా కార్ స్పేర్ టైర్లో దాచిన గంజాయిని హైదరాబాదుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. వారిలో ఓ వ్యక్తి హోంగార్డ్గా పనిచేయడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా మల్కానగిరి జిల్లాకు చెందిన ఉమాకాంత్ నగర్ అనే వ్యక్తి.. గంజాయిని హైదరాబాద్కు తరలించేందుకు నీలాంబర్ మీర్కన్ అనే వ్యక్తిని సంప్రదించాడు. ఒప్పందం ప్రకారం నీలాంబర్ తన స్నేహితుడు సోనాకలాతో కలిసి కారులో బయలుదేరాడు. అయితే రామోజీ ఫిల్మ్సిటీ సమీపంలోని వాహనాల తనిఖీ వద్ద ఎక్సైజ్ సిబ్బంది వారిని ఆపి వాహనాన్ని చెక్ చేశారు.
మొదట్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. కానీ వారి ప్రవర్తనపై అనుమానం కలగడంతో.. మరింత నిశితంగా చెక్ చేశారు. ఆ సమయంలో కార్లో ఉన్న స్పేర్ టైర్పై చెదురుమదురు గుర్తులు కనిపించడంతో అధికారులు అనుమానంతో టైర్ను విప్పి చూశారు. అందులో నుంచి నాలుగు ప్యాకెట్లలో దాచిన 15 కిలోల గంజాయి బయటపడింది. అది చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
తర్వాత వారి దగ్గర నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని.. నీలాంబర్ మీర్కన్, సోనాకలాను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న కార్, గంజాయిని హయత్నగర్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. గంజాయి సప్లై చేసిన ఉమాకాంత్పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.