
హైదరాబాద్, మే 15: నూనె, పప్పులు, కూరగాయల ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడి నెత్తిన తాజాగా డీజిల్, పెట్రోల్ బాంబ్ పడిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం వస్తే అన్ని కష్టాలు మర్చిపోయి ఇంటిల్లిపాది కమ్మని చికెన్ కూర వండుకుని తిని.. టీవీ ముందు కూర్చుని రిలాక్స్ అయ్యే మిడిల్ క్లాస్ జనాలకు ఇప్పుడు చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. గత నెలలో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.250 నుంచి రూ.285 వరకు ఉంటే ఇప్పుడు ఆకాశానికి ఎగబాకాయి. గత ఆదివారం ఏకంగా రూ.350 నుంచి రూ.360 మార్కు దాటేసింది. సోమవారం నుంచి కిలో చికెన్ రూ.330కి చేరినప్పటికీ రానున్న ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరుగుదల అదనపు భారం కానున్నాయి. మరో వైపు ఎండలు దాటికి కోళ్లు చనిపోతున్నాయి. దీంతో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
గత వారం రోజుల నుంచి చికెన్ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో కిలో, రెండు కిలోలు కొనేవారు అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఇక మటన్ ధరలు సరేసరి. మటన్ కిలో రూ. 1000 నుంచి రూ. 1200 వరకు ఉంది. ఎండలు, పెళ్లిళ్ల సీజన్, సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో మాంసం ప్రియులకు చికెన్, మటన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. జూన్ నెలాఖరు వరకు ధరలు ఇలానే కొనసాగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ప్రస్తుతం పతు మార్కెట్లలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే.. చికెన్ లైవ్ బర్డ్ కిలో రూ. 190 నుంచి 210 వరకు, చికెన్ స్కిన్తో కిలో రూ. 320, స్కిన్లెస్ కిలో రూ. 330 నుంచి రూ.360, బోన్లెస్ కిలో రూ. 640 నుంచి 660 వరకు పలుకుతుంది. ఇక గుడ్లు డజన్ రూ.72 నుంచి 80 వరకు ధర పలుకుతున్నాయి. ఎండల తీవ్రతతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం వల్ల డిమాండ్కు తగ్గ సప్లయ్ మందగించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.