Dalitha Bandhu Portal: దళిత సాధికారతకు ‘తెలంగాణ దళిత బంధు’.. దరఖాస్తు కోసం ప్రత్యేక యాప్.. వివరాలు ఇవే..!

రాష్ట్రంలో దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి అమలు చేయాలని భావిస్తోంది.

Dalitha Bandhu Portal: దళిత సాధికారతకు తెలంగాణ దళిత బంధు.. దరఖాస్తు కోసం ప్రత్యేక యాప్.. వివరాలు ఇవే..!
Cm Kcr

Updated on: Jul 24, 2021 | 8:59 AM

Telangana Dalitha Bandhu Scheme Special App: తెలంగాణ​రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి “తెలంగాణ దళిత బంధు” అనే పేరును ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. రాష్ట్రంలో దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలును ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు.

సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. అన్నదాతలను ఆదుకునేందుకు ఉద్దేశించిన ‘రైతు బీమా’ పథకం కూడా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన ‘రైతుబంధు’ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తున్న సీఎం.. తెలంగాణ దళిత బంధు పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.

అయితే, ఈ సదుపాయాన్ని పొందేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. పారదర్శకంగా, నిక్కచ్చిగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. వెబ్‌పోర్టల్‌తోపాటు యాప్‌ను ఈ నెలాఖరులోగా సిద్ధంచేసి ఆగస్టు తొలి వారానికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సీజీజీకి సూచించింది.

కాగా, ఈ పథకం కింద నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకాల కోసం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందని వారిని తొలి ప్రాధాన్యం కింద గుర్తించాలని, ఆ తర్వాత కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 26న దళిత బంధు అవగాహన కార్యక్రమంలో ఈ మేరకు విధివిధానాలు వెలువడే అవకాశముంది. సాంఘిక సంక్షేమ శాఖలో వివిధ పథకాల అమలుకు 2021 22 ఆర్థిక సంవత్సరానికి రూ.250 కోట్లు జమయ్యాయి. ఈ నిధులను దళిత బంధు కోసం ఖర్చు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.

Read Also..

Telangana Jobs: 95% కొలువులు స్థానికులకే.. జోనల్ వ్యవస్థ అమలుపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ జీఏడీ..