AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్కడంటే..?

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగాా కీలక ప్రకటన జారీ చేసింది. వచ్చే నెలలో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే మరో రెండు ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై స్పష్టతిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్కడంటే..?
Airport
Venkatrao Lella
|

Updated on: Jul 01, 2026 | 6:23 PM

Share

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంది. విమాన ప్రయాణం చేయాలంటే రాష్ట్ర నలుమూలల ప్రజలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు రావాల్సి వస్తోంది. దీంతో ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేకుండా సమీప ప్రాంతంలోనే ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కొత్త ఎయిర్‌పోర్టులపై దృష్టి పెట్టింది. మరో మూడు ఎయిర్‌పోర్టులను నిర్మించేందుకు ముందడుగు వేసింది. ఇప్పటికే వరంగల్ వద్ద మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ఆమోదం లభించగా.. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఆదిలాబాద్, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ వాయుసేనకు సంబంధించి ఎయిర్‌స్ట్రిప్ ఉండగా.. దీని కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనిని అనుకుని ఉన్న భూమితో పాటు మరికొంత భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్నారు. కేంద్ర విమానయాన సంస్థ ఇప్పటికే దీని నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మిలిటరీతో పాటు పౌరులకు కూడా ఉపయోగపడేలా దీని నిర్మాణం చేపట్టనున్నారు. ఇక కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుండగా.. దీనికి అనుమతి రావాల్సి ఉంది. కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. త్వరలోనే తుది అనుమతులు లభించనున్నాయని సమాచారం.

ఉత్తమ్ కీలక ప్రకటన

తాజాగా హైదరాబాద్‌లో ఏరోమార్ట్ 2026 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన చేశారు. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు వచ్చే నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిందని, డీపీఆర్ కూడా రెడీ అయిందన్నారు. మిలిటరీ, పౌర అవసరాలకు ఉపయోగపడేలా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగానికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు అవసరమైన విడిభాగాలు తయారుచేసే 1500కిపైగా ఎంఎస్ఎంఈలు ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచంలో యుద్ద విమానాలు, హెలికాప్టర్లకు మేడ్ ఇన్ తెలంగాణకు లేబుల్‌తో కూడిన విడిభాగాలు అమర్చబడుతున్నాయని తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతికి ఇదే ఒక నిదర్శనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Follow Us