Telangana: బొమ్మ బొరుసు ఆట పేరుతో దారి దోపిడీ.. వృద్ద దంపతుల నుంచి బంగారం, నగదు చోరీ

| Edited By: Surya Kala

Feb 04, 2024 | 1:19 PM

హోటల్ వద్ద నుంచి ఆ వృద్ధ దంపతులను దుండగులు ఫాలో అవుతూ రెక్కి నిర్వహించారు. ఆ దంపతులు బస్టాండ్ లోకి వెళ్ళాక దుండగులు ఎక్కడికి వెళ్లాలని వారిని ప్రశ్నించారు. దీంతో ఆ దంపతులు జూలూరుపాడు వెళ్లాలని సుమో వాహనంలో ఉన్న దొంగలకు తెలిపారు. తాము కొత్తగూడెం వైపు వెళ్తున్నామని చార్జీ లేకుండా ఉచితంగా తీసుకువెళ్తామని ఆ వృద్ధులను సుమోలో ఎక్కించుకున్నారు. ఆ సమయంలో ఆ కారులో వృద్ధ దంపతులతో పాటు మరో ఐదుగురు ఉన్నారు.

Telangana: బొమ్మ బొరుసు ఆట పేరుతో దారి దోపిడీ.. వృద్ద దంపతుల నుంచి బంగారం, నగదు చోరీ
Khammam Wyra
Follow us on

ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండ్ లో లిఫ్ట్ ఇస్తామని చెప్పి వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని బొమ్మ బొరుసు ఆట పేరుతో వారి వద్ద ఉన్న సుమారు రూ.2.55 లక్షల సొత్తును దుండగులు దారిదోపిడి చేసిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. దొంగతనాలకు మరో భాష్యం చెప్పే విధంగా దుండగులు ఈ చోరీ చేయడం విశేషం. బొమ్మ బొరుసు ఆట పేరుతో ముందు వంద రూపాయలు వృద్ధ దంపతులకు వచ్చాయని ఆశ చూపి ఆ తర్వాత వారి దగ్గర ఉన్న సొత్తును మొత్తాన్ని కొల్లగొట్టారు. బాధిత వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వాంకుడోత్ కేతా నాయక్, బాలి వైరాలోని లైన్స్ ఐ కేర్ హాస్పిటల్ లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. అక్కడ కంటి పరీక్షలు చేయించుకొని మందులు తీసుకున్న వారు తిరిగి పాపకొల్లు వెళ్లేందుకు వైరా బస్టాండుకు చేరుకున్నారు. బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో వారు భోజనం చేసి బస్ కోసం బస్టాండ్ లోకి వెళ్తున్నారు. అయితే హోటల్ వద్ద నుంచి ఆ వృద్ధ దంపతులను దుండగులు ఫాలో అవుతూ రెక్కి నిర్వహించారు. ఆ దంపతులు బస్టాండ్ లోకి వెళ్ళాక దుండగులు ఎక్కడికి వెళ్లాలని వారిని ప్రశ్నించారు. దీంతో ఆ దంపతులు జూలూరుపాడు వెళ్లాలని సుమో వాహనంలో ఉన్న దొంగలకు తెలిపారు. తాము కొత్తగూడెం వైపు వెళ్తున్నామని చార్జీ లేకుండా ఉచితంగా తీసుకువెళ్తామని ఆ వృద్ధులను సుమోలో ఎక్కించుకున్నారు. ఆ సమయంలో ఆ కారులో వృద్ధ దంపతులతో పాటు మరో ఐదుగురు ఉన్నారు.

వైరా మండలం స్టేజి పినపాక గ్రామం దాటగానే కారులో ఉన్న దుండగులు బొమ్మ బొరుసు ఆట ప్రారంభించారు. ఆ కారులో ఓ దుండగుడు వాంకుడోత్ కేతానాయిక్ ను 50 రూపాయలు బదులు ఇవ్వాలని వెంటనే తిరిగి ఇస్తానని అడిగాడు. దీంతో కేతా నాయక్ 50 రూపాయలు బదులు ఇచ్చాడు. వెంటనే ఆట వేసి మీ 50 రూపాయలకు వంద రూపాయలు వచ్చాయని కేత నాయక్ కు ఆ దుండగుడు నగదును ఇచ్చాడు. ఆ తర్వాత 10000 ఉంటే ఇవ్వండి ఆటలో గెలిస్తే డబల్ వస్తాయని ఆగంతుకుడు కేతా నాయక్ కు తెలిపాడు. దీంతో ఆశతో తన వద్ద ఉన్న రూ.5000 ఆ దుండగుడికి ఇచ్చాడు. అయితే మరోసారి బొమ్మ బొరుసు ఆట వేసి 5000 రూపాయలు ఆటలో పోయాయని ఆ దుండగుడు వృద్ధుడికి తెలిపాడు. అనంతరం వృద్ధురాలు బాలి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు పెట్టి ఆట ఆడితే లక్ష రూపాయలు పందెం వస్తుందని ఆ దుండగుడు దంపతులను నమ్మించాడు.

ఇవి కూడా చదవండి

బంగారు గొలుసును బాలి తీసి ఇచ్చింది. ఆ తర్వాత ఆటలో గొలుసు కూడా పోయిందని ఆగంతకులు నమ్మబలికారు. వెంటనే కారులోని ఒక వ్యక్తి ఆ డబ్బులు, నాలుగు తులాల బంగారు గొలుసును తీసుకొని తల్లాడ గ్రామ శివారులో దిగిపోయాడు. కారు తల్లాడ దాటిన తర్వాత వృద్ధ దంపతులు అగంతకులతో గొడవపడ్డారు. దీంతో కారులో ఉన్న మిగిలిన అగంతకులు ఆ వృద్ధ దంపతులను తల్లాడ మండలం అంజనాపురం సమీపంలో కారులోంచి బయటికి నెట్టి పరారయ్యారు. తాము మోసపోయామని గ్రహించిన వృద్ధ దంపతులు వైరా, తల్లాడ పోలీసులను ఆశ్రయించారు. ఈ చోరీ విషయాన్ని తెలుసుకున్న వెంటనే వైరా సీఐ ఎన్. సాగర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..