GHMC Meeting: నేడు జీహెచ్‌ఎంసీ పాలక మండలి సమావేశం.. కీలక సమస్యలపై ప్రతిపక్ష కార్పొరేటర్ల గళం

ఇవాళ జీహెచ్‌ఎంసీ పాలక మండలి సమావేశం జరగబోతోంది. వరుస కుక్కకాట్లు, వరదలు, మనుషులను మింగుతున్న నాలాల ఘటనలతో కౌన్సిల్‌ మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీహెచ్‌ఎంసీలోని పలు కీలక సమస్యలపై ప్రతిపక్ష కార్పోరేటర్లు గళమెత్తనున్నారు..

GHMC Meeting: నేడు జీహెచ్‌ఎంసీ పాలక మండలి సమావేశం.. కీలక సమస్యలపై ప్రతిపక్ష కార్పొరేటర్ల గళం
Ghmc Meeting

Updated on: May 03, 2023 | 7:33 AM

ఇవాళ జీహెచ్‌ఎంసీ పాలక మండలి సమావేశం జరగబోతోంది. వరుస కుక్కకాట్లు, వరదలు, మనుషులను మింగుతున్న నాలాల ఘటనలతో కౌన్సిల్‌ మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీహెచ్‌ఎంసీలోని పలు కీలక సమస్యలపై ప్రతిపక్ష కార్పోరేటర్లు గళమెత్తనున్నారు.

నాలుగు నెలల తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం ఇవాళ జరగనుంది. జీహెచ్‌ఎంసీలోని ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోనుంది పాలక మండలి. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడంతోపాటు ఇతర అంశాలపైనా చర్చించనున్నారు. ఇప్పటివరకు స్టాండింగ్ కమిటీ అమోదించిన అంశాలను కౌన్సిల్‌లో చర్చించి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు. ఇక.. ఇవాళ జరిగే జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఇటీవల కురిసిన వర్షాలు, శానిటేషన్, రోడ్ల అభివృద్దితోపాటు.. మనుషులను మింగుతున్న నాలాల వ్యవహారం ప్రధానంగా చర్చకు రాబోతోంది.

నెల రోజులు ఆలస్యంగా కౌన్సిల్‌ సమావేశం

ఇటీవల సికింద్రాబాద్ కలాసిగూడలో నాలాలో పడి బాలిక మృతి చెందడంతో ఆ అంశాన్ని సమావేశంలో లేవనెత్తనున్నారు ప్రతిపక్ష కార్పొరేటర్లు. అయితే.. ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా.. నెలరోజులు ఆలస్యం కావడంతో.. ఈ అంశంపైనా ప్రతిపక్ష సభ్యులు.. అధికార పక్షాన్ని కార్నర్‌ చేసే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీలో వర్షాలు పడ్డప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్ట్రాటజిక్ నాలా డెవలెప్‌మెంట్ ప్రోగ్రామ్ పనులు, పూర్తయిన నాలాల విస్తరణ వంటి అంశాలపై అధికారులను నిలదీసేందుకు మజ్లీస్, బీజేపీ సభ్యులు సన్నద్దమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవిలో ఈసారి భారీ వర్షాలు కురుస్తుండడంతో చాలా డివిజన్లలో సమస్యలు తలెత్తాయి. దాంతో.. ఆయా ప్రాబ్లమ్స్‌పై విపక్ష కార్పొరేటర్లు ఫోకస్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా.. నాలాలు, శానిటేషన్, వీధి కుక్కల నియంత్రణ అంశాలపై బీజేపీ కార్పొరేటర్లు చర్చకు పట్టుబట్టనున్నారు. గత కౌన్సిల్‌ సమావేశంలోనూ బీజేపీ పెద్దయెత్తున సమస్యలు లేవనెత్తడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇవి కూడా చదవండి

ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార పక్షం సిద్ధం

ఇక.. ప్రతిపక్షాలు ఎంత ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించినా ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార పక్షం సిద్ధమైంది. దానికి తగ్గట్లే.. స్టాండింగ్ కమిటీ సభ్యులతోపాటు కొంతమంది కార్పొరేటర్లను మేయర్‌ గట్టిగానే ప్రిపేర్‌ చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సూచించిన పలు అభివృద్ధి ప్రతిపాదనలను ఆమోదించి, పరిపాలనాపరమైన అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వానికి పంపాలని భావిస్తోంది పాలక మండలి. మొత్తంగా.. నాలుగు నెలల తర్వాత జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వీధి కుక్కల బీభత్సం, వరదలు, నాలాల వ్యవహారంపై గట్టిగానే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us