అసెంబ్లీ సమావేశాలకు ఏ మాత్రం తీసిసోని విధంగా జరిగింది జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్. కొందరు సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కాసేపు నడిచింది. రెండో రోజు కౌన్సిల్లో బడ్జెట్పై చర్చ హాట్హాట్గా సాగింది. మంగళవారం ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం జరిగింది.
రాష్ట్రంలో అధికార మార్పిడి తరువాత జరిగిన మొదటి బల్దియా సమావేశం వాడివేడిగా సాగింది. అన్ని పార్టీల కార్పొరేటర్లు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ డివిజన్లలోని సమస్యలను మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యాలయాల్లో కూర్చొని సంతకాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పనులు పర్యవేక్షించాలని బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు సూచించారు. వీరికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. వీధి దీపాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా సభలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఎకరువు పెట్టారు. హైదరాబాద్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని.. కుక్కలు కరిసి జనాల ప్రాణాలు పోతున్నాయని కార్పొరేటర్లు ముక్తకంఠంతో ఆందోళన వ్యక్తం చేశారు. అయినా పట్టించుకోరా అంటూ అధికారులను కార్పొరేటర్లు నిలదీశారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ తక్కువ, ఫంక్షన్స్ ఎక్కువ అని కార్పొరేటర్లు చెబుతున్నారు..
కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కార్పొరేటర్లను కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారన్నారు. కనీసం అధికారులు తమ ఫోన్లు కూడా ఎత్తడం లేదని కార్పొరేటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తాము ఏమి సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతల మధ్య వాదనలు జరిగాయి. జీహెచ్ఎంసీలో అన్ని సమస్యలే ఉన్నాయని.. హైదరాబాద్ పరువు పోతుందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు.
కాగా.. నిన్నటి కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు లంచ్ లోపు గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై చర్చ జరుగనుంది. మధ్యాహ్నం లంచ్ తరువాత 2024 -25 ఆర్థిక సంవత్సరానికి రూ.8,437 కోట్ల జీహెచ్ఎంసీ బడ్జెట్ను మేయర్ ప్రవేశపెట్టారు. రూ.7937 కోట్ల సాధారణ బడ్జెట్, రూ.500 కోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం బడ్జెట్ను రూపొందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…