నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! 17 షాపులు దగ్ధం

నల్గొండ జిల్లా చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం గుట్టకింద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు దగ్ధమయ్యాయి. రెండు గ్యాస్ సిలిండర్లు పేలగా, గ్రామపంచాయతీ కార్యాలయానికీ మంటలు వ్యాపించాయి. సుమారు రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.

నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! 17 షాపులు దగ్ధం
Nalgonda Fire News

Updated on: Jul 26, 2026 | 6:55 AM

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్టకింద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బొమ్మల దుకాణంలో ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపించి మొత్తం 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా భయాందోళనకు గురైంది. స్థానికుల సమాచారం ప్రకారం.. మంటల తీవ్రత కారణంగా ఘటనాస్థలంలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటలు మరింత ఉద్ధృతమై సమీపంలోని గ్రామపంచాయతీ కార్యాలయానికి కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న పలు కీలక దస్త్రాలు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే మూడు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు, గ్రామస్థులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టడంతో మంటలు మరింత విస్తరించకుండా అడ్డుకోగలిగారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ వెల్లడించారు. దుకాణాల్లోని బొమ్మలు, పూజా సామగ్రి, ఇతర వ్యాపార వస్తువులు పూర్తిగా దగ్ధమవడంతో వ్యాపారులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు.

అయితే అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడం, ఆ సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. లేకపోతే భారీ విషాదం చోటుచేసుకునేదని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారికంగా అగ్నిప్రమాదానికి గల కారణాన్ని అగ్నిమాపక శాఖ నిర్ధారించాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us