
మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కన్నతండ్రే కాలయముడై తన ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన తీరు స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన గుంషావలి, తన భార్యతో గొడవపడి క్షణికావేశంలో చేసిన పని ఇద్దరు చిన్నారులను బలితీసుకుంది. సోమవారం (ఏప్రిల్ 27) సాయంత్రం నుంచి భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదం చివరకు మారణహోమానికి దారితీసింది. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన గుంషావలి, పిల్లలను వెంటపెట్టుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నాన్న పిలుస్తున్నాడు కదా అని ఎంతో నమ్మకంతో ఆ చిన్నారులు తండ్రి వెంటే వెళ్లారు. కానీ, ఆ తండ్రి మనసులో ఎంతటి క్రూరత్వం దాగి ఉందో ఆ పసిప్రాణాలకు తెలియదు.
తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలోకి తీసుకున్న ఆ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ముందుగా ఐదేళ్ల విలాస్, మూడేళ్ల వీకేష్లకు ఉరి వేసి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం (ఏప్రిల్ 28) ఉదయం చెట్టుకు వేడాడుతూ కనిపించిన మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి గొడవలు, పంతాలు.. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా, ఏ పాపం తెలియని చిన్నారులను అనాథలుగా మార్చేస్తున్నాయి. ఈ ఘటనతో అమ్మాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..