
దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు ఎరువుల కష్టాలు తప్పడం లేదు. పంట చేతికి వచ్చే కీలక సమయంలో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. యూరియా బస్తాలు దొరకక తీవ్ర ఆవేదనకు గురైన ఓ రైతు.. కనీసం రెండు బస్తాలైనా ఇప్పించాలంటూ సొసైటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నాడు.
వానాకాలం పంటల సాగు చివరి దశకు చేరుకున్నప్పటికీ రైతులకు ఎరువుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పంటకు కీలక సమయంలో యూరియా అందకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగంపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం రోజుల తరబడి రైతులు తిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాల్సి రావడం చిన్నకారు, నిరక్షరాస్య రైతులకు ఇబ్బందిగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్లో బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలియక నేరుగా సొసైటీ కేంద్రాలకు వస్తున్న రైతులకు.. అక్కడ స్టాక్ లేదనే సమాధానం ఎదురవుతోంది.
ఈ క్రమంలోనే తన పొలానికి అవసరమైన యూరియా కోసం వచ్చిన ఓ రైతు.. తనకు ఎక్కువ బస్తాలు అవసరం లేదని, కేవలం రెండు బస్తాలైనా ఇప్పించాలని సిబ్బందిని వేడుకున్నాడు. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురై సిబ్బంది కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయినప్పటికీ యూరియా లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు.
రైతు కన్నీరు పెట్టుకున్న ఈ దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది. సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. క్షేత్రస్థాయిలో రైతులకు సులభంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. యూరియా కొరతను వెంటనే పరిష్కరించి పంట కీలక దశలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతు ఆవేదన వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..