దెయ్యం ఉంది జాగ్రత్త అంటోంది చిన్నగుట్ట తండా. భయంభయంగా బతుకుతోంది. దెయ్యం భయంతో ఊరే మాయం అయిపోయింది. దెయ్యం దెబ్బకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది చనిపోయారట. ఇక పశువులైతే పదుల సంఖ్యలో దెయ్యం రక్త దాహానికి బలయిపోయాయిట. పగలు ప్రశాంతంగానే ఉంటుంది. రాత్రయితే చాలు రాళ్లు పడతాయిట. దెయ్యాన్ని ఎదిరిస్తే ప్రాణాలు తీస్తుందట. ఊరి చివరి ఊడలమర్రి జడలు విప్పుకుని దెయ్యంలా చూస్తుంటుంది. గ్రామంలో మరింత భయం పెంచుతుంటుంది.
ఊరికి దెయ్యం పట్టింది. ఇలా ఒక రోజు కాదు…రెండు రోజులు కాదు…నెలల తరబడి చావు కేకలు వినిపించేవి. మనుషులు, మూగజీవాలు దెయ్యాలకు బలైపోయాయట. రాత్రిపూట ఇళ్లపైన రాళ్లు పడుతూనే ఉంటాయి. తలలు కూడా పగులుతాయి. ఊరికి పట్టిన దెయ్యాన్ని ఉరికించడానికి వచ్చిన మంత్రగాడు కూడా మిస్టీరియస్గా మరణించడంతో ఊరు ఊరునే ఖాళీ చేసేశారు గ్రామస్తులు.
దెయ్యం పెట్టే టార్చర్ భరించలేక ఏకంగా ఊరే పారిపోయిందంటే అక్కడ ఎంత భయం తాండవించిందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు పట్టించుకునే మనుషులు లేక ఇళ్లు దెయ్యాల కోటల్లా మారాయి. జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్న రోడ్లు.. వాటి పక్కన బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మిగిలి పోయిన ఇళ్లు.. ఎవరైనా తిరిగొస్తారేమో అని ఆశగా ఎదురు చూసే వాకిళ్లు.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చిన్నగుట్ట తండాది కొన్నేళ్లుగా ఇదే దుస్థితి. కొందరు గ్రామం వెలుపలకు వెళ్లిపోయి రేకుల షెడ్లు వేసుకోగా మిగిలినవారు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురై పోయారు.
చిన్నగుట్ట తండా…ఒకప్పుడు పచ్చని ప్రకృతి మధ్య ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. ఈ గ్రామంలో 50 గిరిజన కుటుంబాలుండేవి. వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్లు. ఏమైందో ఏమో కానీ కొన్నేళ్ల కిందట రాత్రి అవగానే ఇళ్ల మీద రాళ్లు పడడం మొదలయిందట. మొదట చిన్న చిన్న రాళ్లు తర్వాత పెద్ద సైజు రాళ్లు పడడం మొదలైందట. రాళ్ల దెబ్బలకు చాలామందికి తీవ్ర గాయాలు కూడ అయ్యాయని చెప్తున్నారు గ్రామస్తులు. ఆ తర్వాత వరుసగా 20మంది చనిపోవడంతో ఊరికి దెయ్యం పట్టిందని భావించిన గ్రామస్తులు ఆ పీడ విరగడ చేయడానికి ఓ బాబాని తీసుకొస్తే అతను కూడా అక్కడికక్కడే చనిపోయాడట. దీంతో భయపడిపోయిన గ్రామస్తులు ఊరుని ఖాళీచేసి వెళ్లిపోయారు. ఊరికి కిలోమీటర్ దూరంలోని రేకుల షెడ్లు నిర్మించుకున్నారు. ఇంకొందరు వేరే ఊళ్లకు వెళ్లిపోయారు.
అప్పుడప్పుడు భయంభయంగానే ఊరికి వచ్చి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని కళ్లల్లో తడితో గుండెల్లో బాధతో వెళుతుంటారు తండా వాసులు. దెయ్యం దెబ్బకు ఊరు ఖాళీ చేసి తలో దిక్కుకు వెళ్లిపోయిన తండా వాసులు ఇప్పుడు తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..