Telangana: ఊరంతా కన్నీళ్లు.. మూగజీవితో ముడిపడిన బంధం.. ఈ వీడియో చూడండి..
మనుషులతో మమకారం పెంచుకుని, అందరితో ఆప్యాయంగా తిరిగిన ఆ ఆంబోతు అనారోగ్యంతో కన్నుమూయడంతో ఊరంతా కన్నీరుమున్నీరైంది. తమ ఇంట్లో మనిషే చనిపోయాడన్నంత ఆవేదనతో.. బ్యాండ్ మేళాలు, డీజే సౌండ్ల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఆ మూగజీవం ఆ గ్రామానికి కేవలం ఒక పశువు మాత్రమే కాదు.. ఊరంతటికీ ఒక కుటుంబ సభ్యుడు, అందరూ అల్లారుముద్దుగా పెంచుకున్న సొంత బిడ్డ. అలాంటి ఆంబోతు అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ గ్రామమంతా కన్నీటి సంద్రమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కొన్నేళ్ల క్రితం కొమరారం గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. గ్రామానికి ఒక ఆంబోతు ఉండాలనే సంకల్పంతో.. మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకట్ రెడ్డికి చెందిన ఒక ఆంబోతును గ్రామస్థులంతా కలిసి కొనుగోలు చేశారు. ఆ రోజు నుండి అది కొమరారం గ్రామ సంపదగా, ప్రజల గుండెల్లో ఒకడిగా మారిపోయింది. మనుషులతో ఎంతో ఆప్యాయంగా కలిసిపోతూ, ఊరి వీధుల్లో తిరుగుతూ అందరి మమకారాన్ని చూరగొంది.
వారం రోజులు పోరాడి..
గత వారం రోజులుగా ఆ ఆంబోతు తీవ్ర అనారోగ్యానికి గురైంది. తమ ఇంట్లో మనిషికి బాలేనట్లుగా భావించిన గ్రామస్థులు, వైద్యులను రప్పించి అన్ని రకాల చికిత్సలు అందించారు. అయినా ఫలితం లేకపోయింది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ మూగజీవం శనివారం కన్నుమూసింది. ఆంబోతు మరణ వార్త వినగానే కొమరారం గ్రామస్థులు షాక్కు గురయ్యారు. తమ సొంత కుటుంబ సభ్యుడు చనిపోయాడనే ఆవేదనతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
DJ సౌండ్స్, బ్యాండ్ మేళంతో అంతిమయాత్ర
తమపై ఎంతో ప్రేమను కురిపించిన ఆంబోతుకు ఘనంగా వీడ్కోలు పలకాలని ఊరంతా ఏకమైంది. మృతదేహాన్ని పూలమాలలతో అలంకరించి.. బ్యాండ్ మేళాలు, DJ సౌండ్ల మధ్య గ్రామంలోని అన్ని వీధుల్లో ఊరేగించారు. ఊరి ఆడబిడ్డలు, రైతులు కన్నీటితో హారతులు పడుతూ ఆంబోతు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మూగజీవాలపై మనుషులు చూపించే మమకారానికి నిదర్శనంగా నిలిచిన ఈ అంతిమ వీడ్కోలు దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరినీ కదిలించాయి.
