
తూప్రాన్, సెప్టెంబర్ 10: మెదక్ జిల్లా తూప్రాన్లో కల్లు దుకాణాలపై ఈగల్ టీం ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అక్కడ కల్లు సేవిస్తున్న వినియోగదారులకు డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నలుగురికి డ్రగ్ పాజిటివ్గా తేలినట్లు అధికారులు గుర్తించారు. కల్లు డిపోలోనూ ఈగల్ టీం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 45 బాక్సుల కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కల్లు నాణ్యత, అందులో నిషేధిత మాదక పదార్థాలు కలిపారా అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకఈగల్ టీం దాడుల సమయంలో కల్లు డిపో యజమాని, మేనేజర్ అక్కడ లేకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని పట్టుకునేందుకు అధికారులు చర్యలు చేపడుతు న్నట్లు తెలుస్తోంది..డిపోలో లభించిన కల్లు సీసాలను స్వాధీనం చేసుకుని తదుపరి పరీక్షల కోసం నమూనాలు సేకరించే అవకాశం ఉంది..ఇక కల్లు తాగుతున్న వారిలో నలుగురికి డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రాథమిక పరీక్షల ఫలితాలను నిర్ధారించేందుకు తదుపరి వైద్య/ల్యాబొరేటరీ పరీక్షలు అవసరమా, ఏ పదార్థానికి పాజిటివ్ వచ్చిందనే వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
మరో వైపు మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు తనిఖీలను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో తూప్రాన్లో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించు కున్నాయి. ఇటీవల తూప్రాన్ పట్టణంలోనూ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేసినట్లు సమాచారం. కల్లు డిపోలో స్వాధీనం చేసుకున్న సీసాల్లో కల్లు నాణ్యత ఎలా ఉంది? నిషేధిత పదార్థాల కల్తీ ఏమైనా జరిగిందా? డ్రగ్ పాజిటివ్ వచ్చిన నలుగురికి ఏ పదార్థం కారణమైంది? అనే అంశాలపై అధికారులు నిర్వహించే తదుపరి పరీక్షలతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.