
తునికిపండు.. అలియాస్ అమర్ఫల్.. పేరులోనే అమరత్వం వుంది. దీని విశేషాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. వేసవి కాలంలో ఆరోగ్యాన్ని ప్రసాదించి, ఆయువును పెంచే పండు కావడంతోనే దీనికి అమర్ఫల్ అన్న పేరు వచ్చిందని చెబుతారు. దీనిని అడవి సపోటా అనికూడా పిలుస్తారు. చూడటానికి చిన్నగా ఉంటూ.. తింటే చిత్ర విచిత్రంగా అనిపించే ఈ పండులో పోషకాలు పుష్కలం. ఈ పండు పైభాగం గట్టిగా ఉండటుంది.. లోపల మాత్రం గుజ్జు చాలా మెత్తగా నాజూగ్గా ఉంటుంది. అందులోనే గింజలూ కూడా ఉంటాయి. పండు గుజ్జు రుచి కూడా కొంత తీపి, కొంత వగరు కలగలిసి స్పెషల్ రుచిని కలిగి ప్రత్యేకంగా ఉంటుంది. ఆదిలాబాద్ ఏజెన్సీలో మాత్రమే ఈ తునికి పండ్లు విస్తారంగా కాస్తాయి.
ఒక్కసారి దీని రుచి చూస్తే.. మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటారు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు ఈ పండు దొరకదు. వేసవిలో మాత్రమే ఈ పండు అందుబాటులో ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలను తనలో ఇముడ్చుకున్న తునికి పండ్లు ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే దొరుకుతాయి. అది కూడా ఆదిలాబాద్ అడవుల్లో మాత్రమే లభిస్తాయి. వేసవి వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ అడవుల్లో తునికి పండ్ల కోసం ఆదివాసీ బిడ్డల ప్రయాణం మొదలవుతుంది. వీటి సేకరణ పద్ధతి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఉదయం ఆరు గంటల లోపే గిరిజనులు అడవిలోకి వెళ్లి ఈ తునికి పండ్లను సేకరిస్తారు.
ఈ తునికి పండ్లలో కార్బొహైడ్రేట్లు తక్కువగానూ, ప్రొటీన్లు ఎక్కువగానూ ఉంటాయి. శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు, ఫైబర్ కూడా వీటి ద్వారా పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, సి ఈ ఫలాల్లో సమృద్ధిగా ఉంటాయి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతాయని… కంటిచూపును మెరుగుపరుస్తాయని.. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగు పడుతుందని చెపుతున్నారు నిపుణులు.. తునికి పండ్లలో పొటాషియం అధికంగానూ, సోడియం తక్కువగానూ ఉంటుందని.. ఫలితంగా ఈ పండ్లను తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నోటిపూతకూ అయితే ఈ పండు దివ్యౌషధంగా పనిచేస్తుందని చెపుతున్నారు వైద్యులు. మరీ ఇంతటి పోషక విలువలున్న ఈ పండును మీరు కూడా ఓ సారి రుచి చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిా..