CS Somesh Kumar: తెలంగాణలో ఉచిత విద్యుత్ పథకానికి అర్హులైన నాయి బ్రాహ్మణులు, రజకుల కులస్థుల కోసం జిల్లా కలెక్టర్లు, బిసి సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. దీంతోపాటు లబ్ధిదారులు మీ సేవా సెంటర్లల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలని సోమేశ్ కుమార్ ఐటీ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బిఆర్ కెఆర్ భవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో సోమేశ్ కుమార్ అధికారులతో మాట్లాడారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 28,550 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో10,637 దరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుంచి, 17913 దరఖాస్తులు నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ నుంచి స్వీకరించినట్లు వెల్లడించారు.
ఇంకా అర్హులైన లబ్ధిదారుల కోసం డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులు పేర్లు నమోదుచేసుకోవడానికి జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ సంఘం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మీ సేవా కేంద్రాల్లో కూడా.. ఉచితంగా నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఐటీ అధికారులను ఆదేశించారు. సీజీజీలో రిజిష్ట్రేషన్ చేసుకున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే సంబంధిత డిస్కం ఉన్నతాధికారులకు పంపించి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం జీవో.ఎంస్. నెం.2 తేది 04-04-2021 బీసీ వెల్పేర్ (డి) డిపార్ట్ మెంట్ ద్వారా జారీ చేసింది. దీంతోపాటు నియమనిబంధనలు కూడా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Also Read: