
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన దంపతులు తల్లం పుల్లయ్య(63), తల్లం పద్మ(55) గ్రామంలో కిరాణం దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఉన్నంతలో వారిని చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేశారు.పెద్ద కుమారుడు అమెరికాలో ఉండగా, చిన్న కుమారుడు శివ మిర్యాలగూడలో ఉంటున్నాడు. నెల రోజుల క్రితం దంపతులు బైక్పై మిర్యాలగూడ వెళ్లి వస్తుండగా తుంగపహాడ్ వద్ద వీరి వాహనాన్ని.. ఓ కారు ఢీ కొట్టింది. దీంతో పద్మ వెన్నెముకకు గాయాలయ్యాయి. కొద్దిరోజులు హైదరాబాద్లో చికిత్స తీసుకొని మిర్యాలగూడలోని చిన్న కుమారుడికి ఇంటి వద్ద ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వీరు కంపాసాగర్ ఇంటికి వెళ్తామని కొడుకు శివకు చెప్పారు. దీంతో తన సొంత కారులో డ్రైవర్ను ఇచ్చి పంపించాడు. ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరుకునేవారు. కానీ కారు డ్రైవర్ రసూల్ చేసిన చిన్న పొరపాటు వీరి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది.
నిడమనూరు మండలం ముకుందాపురం వద్దకు రాగానే డ్రైవర్ రసూల్.. చెప్పు జారిపోయింది. కాలుకు చెప్పును సరి చేసుకుంటున్న క్రమంలో కాలు యాక్సిలేటర్కు తగిలి.. కారు వేగం పెరిగింది. దీంతో అదుపుతప్పి నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకుపోయి బోల్తా పడింది. కారు డ్రైవర్ రసూల్ అద్దం తెరుచుకుని బయటికి వచ్చి కేకలు వేయడంతో కాల్వ సమీపంలో ఉన్న వ్యక్తులు.. కొబ్బరిమట్ట ఇవ్వగా పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. నీటి ప్రవాహ దాటికి తట్టుకోలేక కారులో చిక్కుకుపోయిన దంపతులు గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన దంపతుల కోసం గాలిస్తున్నారు. స్థానికులు, అగ్నిమాపక దళం సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లను కూడా రప్పించి గాలింపు చేస్తున్నారు.
అయితే డ్రైవర్ చెప్పులు విడిచి కారు నడిపినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆ చెప్పులు ఎక్సలేటర్, బ్రేక్ దగ్గర కింద ఇరుక్కోవడంతో వాహనం కంట్రోల్ అయి ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు..
Also Read: పశువులకు గడ్డి కోస్తుండగా.. ఏం కనిపించాయో తెలుసా..?