రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!

వేసవి సెలవుల అనంతరం కొత్త ఉత్సాహంతో పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్లసంకీస గ్రామంలోని ఎంపీపీఎస్ (MPPS) పాఠశాల గేటుకు కాంట్రాక్టర్ తాళం వేయడంతో, విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్డుపైనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!
School Locked By Contractor

Edited By:

Updated on: Jun 15, 2026 | 5:34 PM

వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.. ఎన్నో ఆశలు ఆశయాలతో కొత్త విద్యా సంవత్సరానికి గ్రాండ్ వెల్ కామ్ చెప్పారు.. అందరిలాగే ఉదయాన్నే బడికి వెళ్ళిన ఆ ఊరి విద్యార్థులు, ఉపాద్యాయులకు ఉహించని చేదు అనుభవం ఎదురైంది.. పాఠశాల బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తన బిల్లు వసూలు కోసం స్కూల్ కు తాళం వేశాడు.. విద్యార్థులు, ఉపాధ్యాయులను బడి నుండి బయటకు పంపి స్కూల్ గేట్లకు తాళాలు వేశాడు..దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు విధిలేక రోడ్డుపై నిలబడ్డారు.

ఈ అనూహ్య సంఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్లసంకీస గ్రామంలో జరిగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే గ్రామంలోని MPPS పాఠశాల ప్రధాన గేటుకు కాంట్రాక్టర్ తాళం వేయడం చర్చచాంశానియంమైంది. పాఠశాలకు వచ్చిన సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గేటు వద్దే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

“మన ఊరు – మన బడి” కార్యక్రమం కింద నాలుగేళ్ల క్రితం అభివృద్ధి పనులు చేపట్టారు.. ఈ పనులకు రూ.40 లక్షల విలువైన టెండర్‌ ను కాంట్రాక్టర్ రామనాథం దక్కించుకుని, కొత్త తరగతి గదుల నిర్మాణం, పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

పనులు పూర్తయి మూడు సంవత్సరాలు గడిచినా తనకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు. మొత్తం రూ.40 లక్షలలో ఇప్పటివరకు కేవలం రూ.7 లక్షలు మాత్రమే చెల్లించారని ఇంకా రూ.33 లక్షలు బకాయిగా ఉన్నాయని ఆయన తెలిపారు. బిల్లుల విడుదల కోసం పలుమార్లు సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయారు.

పనుల నిర్వహణ కోసం భారీ మొత్తంలో అప్పులు చేయగా అప్పు ఇచ్చినవారు డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.. తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా స్పందన లేకపోవడంతో చివరి మార్గంగా పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు.

పాఠశాల ప్రారంభమైన తొలిరోజే విద్యార్థుల చదువులకు అంతరాయం ఏర్పడటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిల అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us