Telangana: తెలంగాణ అసెంబ్లీలో తొలిబడ్జెట్ ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ సర్కార్..

మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సర్కార్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఇది కాంగ్రెస్‌కు తొలి బడ్జెట్‌ కావడం, 6 గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉంటాయా అని అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్‌ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

Telangana: తెలంగాణ అసెంబ్లీలో తొలిబడ్జెట్ ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ సర్కార్..
Telangana Budget

Updated on: Feb 10, 2024 | 8:00 AM

మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సర్కార్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఇది కాంగ్రెస్‌కు తొలి బడ్జెట్‌ కావడం, 6 గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉంటాయా అని అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్‌ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సర్కార్‌.. తమ తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఇక బడ్జెట్‌పై ఈ నెల 12న చర్చ జరగనుంది. ఈసారి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పద్దు ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్‌ మార్క్‌ కూడా ఈ బడ్జెట్‌లో కనిపిస్తుందంటున్నారు. కాంగ్రెస్‌.. తమ ప్రాధమ్యాల ప్రకారం బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తం 119 నియోజకవర్గాలకు 1190 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అన్ని నియోజకవర్గాలకు ఎప్పుడూ బడ్జ్‌ట్‌లో నిధులను కేటాయించలేదు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఒక్కో చోట విద్యారంగ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు కోటి రూపాయలను కేటాయిస్తారని చెబుతున్నారు. ఈసారి బడ్జెట్‌ రూ. 2.60 లక్షల కోట్ల నుంచి రూ 2.70 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇది గత బడ్జెట్‌ కంటే 10 శాతం తక్కువ. వాస్తవ రాబడులు, వాస్తవ వ్యయాల ఆధారంగానే బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని సమాచారం.

ఇక మొదటి సంవత్సరంలోనే అన్ని హామీలను అమలు చేయడం సాధ్యం కాదని, ఈసారి కొన్నింటిని అమలు చేస్తామంటూ ప్రజలకు భరోసా ఇవ్వబోతోంది కాంగ్రెస్‌ సర్కార్‌. తమ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల్లో కొన్నింటికి చోటు కల్పించింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.3000 కోట్లకు పైగా నిధులను కేటాయించే ఛాన్స్‌ ఉందంటున్నారు. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం ప్రభుత్వానికి భారంగా పరిణమించనుంది. దీని కోసం రూ.4000 కోట్లకు పైగానే విద్యుత్తు పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేతకు కూడా నిధుల కేటాయింపు ఉండనుంది. కల్యాణమస్తు పథకం కింద రూ.1,00,116 నగదును అందిస్తూనే.. తులం బంగారాన్ని కూడా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. అంటే.. ఒక్కొక్క లబ్ధిదారుకు దాదాపు రూ.1.70లక్షలను వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ శాఖలు అందజేసిన బడ్జెట్‌ ప్రతిపాదనలను కూడా పక్కాగా లెక్కించి, పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతిపాదించే బడ్జెట్‌ 100 శాతం వ్యయమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏపీ నుంచి విద్యుత్తు సంస్థల బకాయిల తాలూకు రూ.17,828కోట్లు, గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రూ.40వేలకోట్లు వస్తాయని అంచనా వేసింది. ఆ నిధులు అందేవి కావన్న విషయాన్ని ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, సర్కారు తన ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి బడ్జెట్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..