
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం చివరి అంకానికి చేరుకోవడంతో బీఆర్ఎస్ స్పీడు పెంచింది. ప్రచారంలో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి కేటీఆర్.. అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నారు. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ రాయలసీమ సంఘం మంత్రి కేటీఆర్ను కలుసుకుని తమ సంఘీ భావం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
రెండోసారి అధికారమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వివిధ వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కులాలు, మతాలకతీతంగా ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ను కలిసిన గ్రేటర్ రాయలసీమ రెడ్డి సంఘ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మా ఓటు అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. తీర్మానం కాపీలను మంత్రి కేటీఆర్కు అందజేశారు. కులసంఘాల సభ్యులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ను ఘనంగా సత్కరించారు. గ్రేటర్ రాయలసీమ వాసులందరూ కూడా కలిసి బీఆర్ఎస్ పార్టీ విజయానికి పని చేస్తామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ నలుమూల నుంచి తరలి వచ్చిన రెడ్డి సంఘం నాయకులు ఈ క్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని ప్రాంతాల వారికి సీఎం కేసీఆర్ సముచితం కల్పిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
అటు BRS అభ్యర్థుల తరుపున ప్రచారం చేసేందుకు NRIల బృందం హైదరాబాద్కు వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తాము, బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా సహకారం అందిస్తుమన్నారు. బీఆర్ఎస్ ప్రచారం కోసం 52 దేశాలకు చెందిన 150 మంది ఎన్నారైలు రాష్ట్రానికి వచ్చామని తెలిపారు NRI BRS సభ్యులు.. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో తాము ప్రచారం చేస్తున్నామన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…