
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న కే. తిరుమలేష్ (14) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నారి మరణంతో కుటుంబంతో పాటు గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తిరుమలేష్ బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటేసింది. కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమీపంలో తక్షణ వైద్యం అందుబాటులో లేకపోవడంతో అతడిని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తిరుమలేష్ కన్నుమూశాడు. చదువులో చురుకుగా ఉండే బాలుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో అత్యవసర వైద్య సదుపాయం లేదా పాము కాటుకు వెంటనే చికిత్స అందించే కేంద్రం ఉండి ఉంటే తిరుమలేష్ ప్రాణాలు దక్కేవని వారు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయాలని అధికారులను కోరుతున్నారు.
ఒక కుటుంబానికి ఆశగా ఉన్న కుమారుడు క్షణాల్లో దూరం కావడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, తిరుమలేష్ మృతితో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..