
సెల్ఫోన్ బ్యాటరీని సరదాగా నోటితో కొరికి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడో బాలుడు.. క్యీపాడ్ ఉండే ఫోన్ నుంచి బ్యాటరీని బయటకు తీసి కొరికాడు అతను.. ఆ బ్యాటరీ క్షణంలో బాంబు పేలినట్లు పేలింది.. ఫోన్ బ్యాటరీ చిన్న సైజే.. కానీ దాని పర్యవసానం మాత్రం భయంకరంగా ఉంది. మొహం మొత్తం ఛిద్రమైపోయింది. బాలుడి కళ్లు, నుదురు తప్ప మొత్తం భాగమంతా ఛిద్రమైపోయింది. ఒంటినిండా రక్తమోడుతూ ఆ బాలుడు పెట్టిన ఆర్తనాదాలు వింటే ప్రాణం తరుక్కుపోతుంది. ఆస్పత్రికి తరలించేందుకు కూడా సహకరించలేనంతగా అల్లాడాడు.. ఏదోలా నానా తంటాలుపడి ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. ఈ తీవ్ర విషాద ఘటన కొమురంభీం జిల్లా చింతలమానపల్లి మండలం గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. సెల్స్ బ్యాటరీ పేలి నికాడి లోకేష్ అనే 12 ఏళ్లు బాలుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఘటన చోటు చేసుకోగా.. రక్తపుమడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొడుకును కాపాడుకునేందుకు తల్లిదండ్రులు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి
కొమురంభీం జిల్లా చింతలమానపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికాడీ శారద – గణేష్ ల కుమారుడు నికాడి లోకేష్ ( 12 ) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఉదయం వర్షం కురవడంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఈ తరుణంలో.. భోజనం చేస్తున్న సమయంలో పొరపాటున ఛార్జింగ్ లైట్లోని బ్యాటరీని తీసుకున్నాడు.. అనంతరం ఆ బ్యాటరీని నోట్లో పెట్టుకుని కొరికాడు.. దీంతో అది ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ నోట్లో పేలింది. ఈ ఘటనలో బాలుడు లోకేష్ నోరు ఛిద్రమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
తల్లిదండ్రులు కొడుకు ప్రాణాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగింది.. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..