AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Regional Ring Road: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ఆమోదం

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్ర సర్కార్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ ...

Regional Ring Road: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ఆమోదం
Subhash Goud
|

Updated on: Feb 13, 2021 | 11:00 AM

Share

Regional Ring Road: తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్ర సర్కార్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గట్కారీ తెలిపినట్లు లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టుల అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గట్కారీని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

హైదరాబాద్‌కు చుట్టూ 254 కిలోమీటర్ల పొడవున ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రతిపాదించిన విషయాన్ని నామ నాగేశ్వర్‌ కేంద్రమంత్రికి వివరించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు విడతలుగా కేంద్రానికి లేఖ కూడా రాశారని ఆయన గుర్తు చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ మరింత అభివృద్ధి పథంలో పయనించి, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ముందు చూపుతో ఆలోచించి ఆర్‌ఆర్‌ఆర్‌కు రూపకల్పన చేశారని అన్నారు. 2017లో సంగారెడ్డి నుంచి తుప్రాన్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు మొదటి దశలో నిర్మించే జాతీయ రహదారికి ఎన్‌హెచ్‌ 161 ఏఏ గా నెంబర్‌ కేటాయించారని పేర్కొన్నారు. దీనిని 166 కిలోమీటర్ల వరకు నిర్మించేందుకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని ఆయన వెల్లడించారు.

రెండో దశలో చౌటుప్పల్‌-షాద్‌నగర్‌ మీదుగా కంది వరకు నిర్మించే 182 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టును జాతీయ రహదారిగా గుర్తిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖకు నివేదికలు సమర్పించామని నామా తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు నామా నాగేశ్వరరావు మంత్రికి చెప్పారు.

నాగపూర్‌-హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌, పుణె-హైదరాబాద్‌-విజయవాడ కారిడార్‌లో జాతీయ రహదారి కనెక్టివిటీ ప్రాముఖ్యత పెరుగుతుందని అన్నారు. అలాగే హైదరాబాద్‌ చుట్టుపక్కల వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ఈ రహదారి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Also Read: Baby Birth: నాలుగున్నర కిలోల బరువుతో జన్మించిన శిశువు.. ఆశ్యర్యపోతున్న వైద్యులు.. తల్లీబిడ్డ క్షేమం